– ఆయన స్ఫూర్తి పథంలో జిల్లా అభివృద్ధికి కృషిచేద్దాం
– పేదల అభ్యన్నతికి సమష్టిగా సేవలందిద్దాం
– స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు ముందడుగు వేద్దాం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కీర్తిప్రతిష్టలు అజరామరమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతి, సమాజ సేవకు ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తెలుగు జాతి గర్వపడే విధంగా ఎన్టీఆర్ అమలుచేసిన విప్లవాత్మక పరిపాలనా సంస్కరణలు ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమని.. పరిపాలనను ప్రజలకు చేరువచేయాలనే ఉద్దేశంతో సాహసోపేత నిర్ణయాలను తీసుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమష్టిగా పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామని, జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేద్దామన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర – వికసిత్ భారత్ లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News