విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ 29, 30 వ వార్షిక కాన్వకేషన్ ను జూన్ 2వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళా క్షేత్రంలో సంయుక్తంగా నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు.
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ముఖ్య ప్రసంగం చేయడంతో పాటు విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, గోల్డ్ పథకాలు ప్రదానం చేయనున్నారన్నారు. కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందన్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన ఇద్దరు ప్రముఖ కార్డియాలజిస్టులకు విశ్వ విద్యాలయం గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ (D.Sc) పురస్కారాలను ప్రదానం చేయనుందన్నారు. హైదరాబాద్లోని ఏఐజి హాస్పిటల్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి. నరసింహన్, అపోలో హాస్పిటల్స్కు చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.సి. రథ్ ఈ గౌరవానికి ఎంపికయ్యారయ్యారన్నారు. 29, 30వ కాన్వకేషన్ కు సంబంధించి మొత్తం 122 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు 162 పతకాలు ప్రదానం చేయనున్నారన్నారు. వీటిలో 123 బంగారు పథకాలు, 39 వెండి పథకాలు ఉన్నాయన్నారు. అదనంగా 37 ఎండోమెంట్ బహుమతులను కూడా అందజేయనున్నారన్నారు.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా విద్యా సంవత్సరాల్లో ఏర్పడిన జాప్యం నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా రెండు కాన్వకేషన్ లు కలిపి నిర్వహిస్తున్నట్లు వైస్ ఛాన్సలర్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి యథావిధిగా ఒకే కాన్వకేషన్ ను నిర్వహిస్తామని వెల్లడించారు. కాన్వకేషన్ నికి ముందు రోజు జూన్ 1 వ తేదీ సాయంత్రం విశ్వ విద్యాలయ ప్రాంగణంలో ప్రీ-కాన్వకేషన్ గెట్-టుగెదర్ డిన్నర్ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. ఇందులో యూనివర్సిటీ డీన్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారన్నారు. ఈ చారిత్రాత్మక కాన్వకేషన్ ను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలియజేశారు.
తదనంతరం కాన్వకేషన్ కు సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు…
పాత్రికేయుల సమావేశంలో యూనివర్శిటీ రిజిస్ట్రార్ డా. సాయి సుధీర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సీహెచ్ శ్రీకాంత్, డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ డా. సుధ, జాయింట్ రిజిస్ట్రార్ (అడ్మిన్) కే. నిలిమ, జాయింట్ రిజిస్ట్రార్ ( అడ్మిన్) పి. ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News