Breaking News

అమరావతిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ ఏర్పాటు చేయండి.

-ఫైబర్ ఉత్పత్తి అయ్యే ఉద్యాన పంటలతో రైతులకు అదనపు ఆదాయాలు
-ఏపీలో కొబ్బరితో సహా వేర్వేరు పంటల ద్వారా పీచు ఉత్పత్తికి ఆస్కారం
-కేంద్ర జౌళి శాఖ మంత్రికి సీఎం ప్రతిపాదనలు
-సచివాలయంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరు ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫైబర్ కు ప్రోత్సహం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం తనను కలిసిన కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తో సీఎం ఈ ప్రతిపాదనలు సమర్పించారు. రాయలసీమ సహా కోస్తాంధ్ర ప్రాంతాల్లో సాగు చేస్తున్న వివిధ పంటల ద్వారా పీచు, నార, ఫైబర్ ఉత్పత్తి అవుతుందని, దీనిని వాణిజ్య స్థాయిలో విలువ జోడించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని సీఎం కోరారు. పీచు వెలికితీతతో పాటు వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడే ఉద్యానవన పంటల నివేదికను సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి సమర్పించారు. కడప, అనంతపురం, నంద్యాల, పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి లాంటి అరటి పండించే జిల్లాలలో పోస్ట్-హార్వెస్ట్ విలువ ఆధారిత ప్రక్రియగా అరటి కాండం పీచు వెలికితీత కేంద్రాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యాన శాఖ సమన్వయంతో స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత మెకానికల్ డెకోర్టికేటర్ యూనిట్లను ప్రోత్సహించేలా సహకారం అందించాలని సీఎం కోరారు. ప్రస్తుతం ఏపీలో 1,29,931 హెక్టార్లలో అరటి సాగవుతోందనీ. పంట కోత తర్వాత కాండం పూర్తిగా వృధాగా పోకుండా. సెల్యులోజిక్ పీచు ద్వారా పర్యావరణ అనుకూల ఫైబర్ తయారు అవుతుందని వివరించారు. వస్త్ర పరిశ్రమలో జనపనారతో సమానంగా ఇది ఉపకరిస్తుందని తెలిపారు. హస్తకళలు, జియో టెక్స్‌టైల్స్, ప్రత్యేక పేపర్, ఎగుమతి రకం దుస్తుల తయారీకి వనరుల లభ్యత ఉందని వివరించారు. వస్త్ర పరిశ్రమతో పీపీపీ భాగస్వామ్యాల ద్వారా వెదురుకు సంబంధించిన మెకానికల్ ఫైబర్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. తద్వారా గిరిజన, మెట్ట ప్రాంత రైతులకు 30 ఏళ్ల పాటు నిరంతర ఆదాయం లభిస్తుందనీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోక చెక్క ఆకుల ద్వారా లీఫ్ షీట్స్ తయారీకి అనుబంధ పరిశ్రమలకు అవకాశం ఉందని సీఎం వివరించారు. చాపలు, జియో టెక్స్‌టైల్ రోల్స్, కాంపోజిట్ బోర్డుల తయారీకి అనుకూలంగా ఉంటుందని.. స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా వీటి తయారీకి ఆస్కారం ఉందని తెలిపారు. శ్రీ సత్యసాయి, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి జిల్లాల్లో ఎక్కువగా లభించే ఈ వనరు వల్ల పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్, ఫ్లోర్ మ్యాట్స్ వంటి కుటీర, చిన్న తరహా పరిశ్రమలకు ఊతం లభిస్తుందనీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో కొబ్బరి పీచు పరిశ్రమను బలోపేతం చేసేలా ప్రస్తుత కాయిర్ బోర్డ్ డ్వాక్రా నెట్‌వర్క్ ద్వారా మెకనైజ్డ్ హస్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, కాయిర్ జియో టెక్స్‌టైల్స్ పరిశ్రమల స్థాపనకు జౌళి శాఖ సహకారం కావాలని సీఎం పేర్కొన్నారు. 1,16,367 హెక్టార్లలో కొబ్బరి సాగవుతోందనీ రాజమహేంద్రవరంలో కాయిర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలు, శిక్షణ కేంద్రాలుప అందుబాటులో ఉన్నాయనీ.. కొబ్బరి పీచుకు ఉప్పు నీరు, బూజు కీటకాలను తట్టుకునే సహజ గుణం ఉండటం వల్ల తీరప్రాంత జియోటెక్నికల్ అప్లికేషన్లలో దీనికి ఎంతో డిమాండ్ ఉందనీ సీఎం వివరించారు. ఏపీకి ఉన్న వెయ్యి కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంతో పాటు కృష్ణా-గోదావరి డెల్టా పరిధిలో గట్లు బలోపేతానికి, నేల కోత నివారణకు ఈ కాయిర్ జియో టెక్స్‌టైల్స్ ఎంతో కీలకం అవుతాయని సీఎం తెలిపారు. ముడి పీచు ఎగుమతి కంటే జియో-రోల్స్, నీడిల్-ఫెల్ట్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా 3 నుండి 4 రెట్లు ఎక్కువ ధర లభిస్తుందనీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

కుప్పం లో పీఎం మిత్రా పార్కు అమరావతిలో నిఫ్ట్ ఏర్పాటుకు సహకారం

ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వస్త్ర పరిశ్రమ క్లస్టర్లకు సమీపంలో ఉన్న కుప్పంలో పీఎం మిత్రా పార్కును ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. 35 వేల పవర్ లూమ్ లు, 100కు పైగా స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయని తెలిపారు. ఫైబర్ టు ఫ్యాషన్ కు అనుకూలించేలా ఈ పీఎం మిత్రా పార్కు 2.0 ఏర్పాటు చేయాలని కోరారు. అమరావతిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీనికి అవసరమైన రూ.280 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. నిఫ్ట్ కోసం అమరావతిలో 10 ఎకరాల భూమిని కేటాయించినట్టు వివరించారు. అలాగే ఏపీలోని వివిధ వస్త్ర పరిశ్రమ క్లస్టర్లలో ఇంటిగ్రేటెడ్ వెట్ ప్రాసెసింగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పార్కుల ద్వారా ఎండ్ టూ ఎండ్ ప్రాసెసింగ్ పెరిగి రవాణా ఖర్చులు తగ్గుతాయని వివరించారు. నేషనల్ న్యూ ఏజ్ ఫైబర్ మిషన్ కింద ఏపీని ప్రాధాన్యతా రాష్ట్రంగా గుర్తించాలని కోరారు. తద్వారా అరటి పీచు లాంటి ఫైబర్ కు విలువ జోడించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. వివిధ చేనేత క్లస్టర్లలో అరటి ఫైబర్ తో బ్లెండ్ చేసిన నూలు వినియోగించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మంగళగిరి లో 22.36 కోట్ల తో చేనేత పార్కు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. అలాగే అమరావతిలో చేనేత హస్త కళల మ్యూజియం ఏర్పాటుకు సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ జౌళి మంత్రిత్వ శాఖ తరపున ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *