– పారిశ్రామిక సమగ్రాభివృద్ధిలో జిల్లాను ఆదర్శంగా నిలుపుదాం
– ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త దిశగా వడివడిగా అడుగులేద్దాం
– తాజాగా 26 క్లెయిమ్లకు రూ. 3.48 కోట్ల ప్రోత్సాహకాలకు ఆమోదం
– డీఐఈపీసీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గౌరవ ముఖ్యమంత్రి దార్శనికతకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు సత్వర అనుమతులు జారీచేస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ఫూర్తితో అడుగులేద్దామని.. పారిశ్రామిక అభివృద్ధిలో జిల్లాను ఆదర్శవంతంగా నిలబెడదామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
శనివారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. పారిశ్రామిక అనుమతులు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తదితరాలతో పాటు వివిధ పారిశ్రామిక చేయూత పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్ధికి విశేష కృషిచేస్తోందని.. ఆ వేగాన్ని సమన్వయ శాఖల అధికారులు అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని కోణాల్లో పెట్టుబడిదారులకు అవసరమైన సహాయసహకారాలను అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర సాకారానికి పారిశ్రామిక అభివృద్ధి కీలకమని.. జిల్లాలోని అన్ని శాసనసభ నియోజకవర్గాలలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులకు /ఎంఎంస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయటం జరిగిందని, వాటన్నింటిని త్వరితగతిన పూర్తి చేసి పారిశ్రామికవేత్తలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని తెలియచేసారు. వివిధ అనుమతులకు సంబంధించి సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వస్తున్న దరఖాస్తులను నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా వివిధ పారిశ్రామిక అభివృద్ధి విధానాల కింద 26 క్లెయిమ్లకు రూ. 3.48 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలకు తాజాగా కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన వాతావరణం రాష్ట్రంలోనూ జిల్లాలోనూ ఉందన్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయమైన “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త “కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మ పథకాల అమల్లో పురోగతిని కమిటీలో చర్చించి.. దరఖాస్తులను త్వరిగతిన పరిష్కరించేందుకు, యూనిట్ల ప్రారంభానికి కలెక్టర్ లక్ష్మీశ దిశానిర్దేశం చేశారు.
ప్రైవేట్ రంగంలో పారిశ్రామికవాడల అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని ప్రభుత్వం తీసుకుని వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆసక్తిగల పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా పరిశ్రమల అధికారి ఎం.మధు, ఏ పీ ఐ ఐ సి జోనల్ మేనేజర్ బాబ్జీ, వాసిరెడ్డి మురళీకృష్ణ (ఫ్యాప్సియా), కనకదుర్గ (అలెప్), ఎం.సుదర్శన్ (డీఐఏ), ఎల్డీఎం వెంకటసుబ్బయ్య, డ్రగ్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీరామ్మూర్తి,డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, పీసీబీ తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News