– పేదలకు చీరల పంపిణీ, అన్నసంతర్పణ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సినీ సెంటర్లోని పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం వద్ద ఈరోజు ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ 84వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు, ప్రజాప్రతినిధులు, కృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు హాజరై సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి, అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ… తెలుగు సినీ పరిశ్రమకు సూపర్ స్టార్ కృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయమని, సాంకేతికతను తెలుగు సినిమాకు పరిచయం చేసి అనేక కొత్త ప్రయోగాలకు నాంది పలికిన మహానటుడిగా ఆయన ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాలలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా అభిమానులు చేపట్టిన సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అభిమాన సంఘాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News