విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, జనాభాలో ఐదు శాతంగా ఉన్న విశ్వబ్రాహ్మణులకు రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయమే జరుగుతోందని తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం 2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధు సూదనాచారి ముఖ్యఆతిదిగా నూతన పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక వర్గాలు విశ్వబ్రాహ్మణుల పట్ల మానవీయ కోణంలో ఆలోచించడం లేదని విమర్శించారు. ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన విశ్వబ్రాహ్మ ణ సామాజిక వర్గాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన విశ్వ బ్రాహ్మణుల ఆర్థిక సామాజిక స్థితిలో మార్పు రాలేదన్నారు. ఇందుకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయకపోవడమే కారణమన్నారు. పాలక వర్గాలు విశ్వ బ్రాహ్మణుల పట్ల మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు పెంట సాయికిరణ్ మాట్లాడుతూ ప్రపంచీకరణ, సరళీకరణ విధానాల వల్ల కుల వృత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఒకప్పుడు పూర్తిగా స్వర్ణకారుల చేతుల్లో ఉన్న బంగారు వ్యాపారం నేడు కార్పొరేట్ సంస్థల పరమైందన్నారు. గతంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 100 ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి కంటే, నేడు రూ. 1.60 లక్షలకు చేరిన తరుణంలో వృత్తిదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో విశ్వబ్రాహ్మణులకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కనీసం రూ. 1000 కోట్లతో ప్రత్యేక ప్రణాళికలు రచించి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కందుకూరి మోహన్, కోశాధికారి ధనమూరి వెంకట లక్ష్మి నరసింహచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కామరాజ్ హరీష్ కుమార్, నగర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిప్పాడ చందు, కార్యవర్గ సభ్యులు, సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News