విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీలకు చట్టసభల్లో 52% రిజర్వేషన్లు కల్పించాలి అని డిమాండ్ చేస్తూ ఈనెల 16న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు తెలిపారు. ఆదివారం విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగించల చంద్రమౌళి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో లాకా మాట్లాడుతూ బీసీలకు చట్టసభలలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, వారి హక్కుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్ణయించిందన్నారు. ప్రధానంగా చట్టసభలలో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లులిలి కల్పించాలి, స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లులిలి అమలు చేయాలి మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు ప్రత్యేక సబ్ కోటా కేటాయించాలి, కేంద్రంలో ప్రత్యేకంగా ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, బీసీల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి, ”మేము ఎంతో మాకు అంత” అనే నినాదంతో విద్య, ఉద్యోగాలలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి అని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కుల గణన చేపట్టి బీసీల అసలు జనాభాను తేల్చాలన్నారు. 16న ఢిల్లీలో జరిగే ధర్నాకు దేశవ్యాప్తంగా ఉన్న బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యలమందయ్యా, అదనపు జనరల్ సెక్రటరీ వజ్జల వెంకట కృష్ణ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంచపు వీరయ్య, జిల్లా అధ్యక్షులు బుర్రి రాజగోపాల్, అన్నమయ్య జిల్లా అధ్యక్షురాలు దివిటి పద్మ యాదవ్ మరియు పలువురు బీసీ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News