-అధికారులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచన
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమృత కృష్ణ వాటర్ ప్లాంట్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శాఖలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమం సందర్భంగా అధికారులతో మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగం కొనసాగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అమృత కృష్ణ వాటర్ ప్లాంట్ ద్వారా నాణ్యమైన తాగునీరు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని శాఖలు, కార్యాలయాలు బయట నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం అందుతోందన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలకు విరుద్ధమని, ప్రభుత్వ కార్యాలయాలు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ (జెడ్పీ), జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) కార్యాలయం సహా ఇతర ప్రభుత్వ శాఖలు తమ కార్యాలయాల్లో నిర్వహించే సమావేశాలు, కార్యక్రమాలకు అమృత కృష్ణ వాటర్ ప్లాంట్ నుంచే తాగునీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
అమృత కృష్ణ వాటర్ ప్లాంట్కు మరింత ప్రోత్సాహం కల్పించేలా బ్యాంకులు, బీమా సంస్థలు ఇతర సంస్థలతో సమన్వయం పెంచాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, ఎల్ఐసీ తదితర సంస్థల ప్రతినిధులను నేరుగా కలిసి వాటర్ బాటిళ్ల సరఫరా, వినియోగంపై చర్చించాలని పేర్కొన్నారు. సంబంధిత సంస్థల ప్రాంతీయ అధికారులతో సంప్రదింపులు జరిపి అవసరమైన ఆర్డర్లు పొందేందుకు చొరవ చూపాలని ఆదేశించారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ రహిత వాతావరణం ఏర్పడేందుకు ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పర్యావరణ హిత చర్యల్లో భాగంగా అమృత కృష్ణ వాటర్ ప్లాంట్ వినియోగాన్ని మరింత విస్తరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News