-మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి కుటుంబాభివృద్ధికి తోడ్పడేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.సోమవారం సాయంత్రం రామకృష్ణాపురం లోని ఆర్ఎంపీ అసోసియేషన్ హాలు లో శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా 230 మంది మహిళలకు కుట్టు మిషన్ల నిర్వహణ, దుస్తుల తయారీ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోగల 135 మంది మహిళలలో 75 మంది కి ఆర్.ఎం.పి అసోసియేషన్ హాల్ రామకృష్ణాపురం లో గల శిక్షణ కేంద్రంలో మరియు 60 మందికి న్యూ ఆర్ఆర్ పేటలో గల శిక్షణ కేంద్రంలో కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోండా ఉమామహేశ్వరరావు మహిళలకు కుట్టు మిషన్లను అందజేసి మాట్లాడారు. మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, నైపుణ్యాభివృద్ధి ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు కుటుంబ ఆర్థికాభివృద్ధికి తోడ్పడగలరని తెలిపారు.
శిక్షణతో పాటు అవసరమైన పరికరాలను అందించడం ద్వారా మహిళలు తమ సొంత ఉపాధి అవకాశాలను సృష్టించుకుని ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ చేపడుతున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. శిక్షణ పొందిన మహిళలు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి మార్గంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సి డి ఓ జగదీశ్వరి, టెక్నికల్ ఎక్స్పర్ట్ సుజాత, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, శిక్షణ పొందిన మహిళలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News