– క్షేత్రస్థాయి కార్యకలాపాలను తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ అభివృద్ధి కోసం జనగణన (సెన్సస్)లో కచ్చితత్వం అత్యంత ముఖ్యమని.. అందుకే దోష రహిత డేటా సేకరణకు ప్రాధాన్యమిస్తున్నట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
మంగళవారం జి.కొండూరు మండలం, మునగపాడులో కలెక్టర్ లక్ష్మీశ పర్యటించి జనగణన–2027కు సంబంధించి ఇళ్ల జాబితా, ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్) దశ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ సెన్సస్-2027 కార్యక్రమం గతం కంటే భిన్నంగా పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహించడం జరుగుతోందని.. కీలక దశ అయిన హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ ను అత్యంత పారదర్శకత, జవాబుదారీతనంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విస్తృత ప్రజాభాగస్వామ్యంతోనే జనగణన ప్రక్రియ విజయవంతమవుతుందని.. జనగణన సిబ్బంది ఇంటింటికీ వెళ్లే సమయంలో ప్రజలు సరైన, పూర్తి వివరాలను తప్పనిసరిగా అందించాలని విజ్ఞప్తి చేశారు. జనగణన ద్వారా సేకరించే గణాంకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం తదితర రంగాల్లో భవిష్యత్ కార్యాచరణకు ఎంతో ఉపయోగపడతాయని కలెక్టర్ వివరించారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని క్షేత్రస్థాయిలో సిబ్బంది నిబద్ధతతో పనిచేసి నాణ్యమైన డేటా సేకరణకు కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
Prajavartha Online Telugu News