Breaking News

ఆవిష్కరణలు, స్వయం ఉపాధి మరియు గ్రామీణాభివృద్ధిలో ముందుకు సాగుతున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), తిరుపతి ప్రధాన కార్యనిర్వాహక అధికారి విజయవంత్ మాథుర్ మరియు ఆయన బృందం మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, సాధించిన పురోగతి మరియు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరించారు.

ఈ సందర్భంగా ఆర్టీఐహెచ్ ప్రతినిధులు మాట్లాడుతూ, సంస్థ ప్రారంభమై ఏడాది కాలం పూర్తికాకముందే వివిధ కార్యక్రమాల ద్వారా 118 నూతన సంస్థలను (స్టార్టప్‌లు) అనుసంధానం చేసినట్లు తెలిపారు. వీటిలో 28 నూతన సంస్థలు అధికారిక ఇంక్యుబేషన్ ఒప్పందాల దిశగా ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు.

ఆవిష్కరణల విస్తరణ కార్యక్రమాల ద్వారా 855 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, 264 సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు), 728 స్వయం సహాయక సంఘాలను అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఇన్నోట్రైబ్ నెట్‌వర్క్ ద్వారా 98 విద్యాసంస్థలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.

విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ఐదుగురు యువ ఆవిష్కర్తలకు తొలి విడత ఆర్థిక సహాయాన్ని అందించి, వారి ఆవిష్కరణల నమూనా రూపకల్పనకు తోడ్పాటు అందించినట్లు తెలిపారు. ఆలోచనల పోటీలు, నాయకత్వ శిక్షణలు, మేధోసంపత్తి హక్కులపై అవగాహన కార్యక్రమాలు, ఆవిష్కరణల ప్రోత్సాహక సమావేశాలు నిర్వహిస్తూ యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆధునిక కేంద్రం ద్వారా ఇంక్యుబేషన్ సౌకర్యాలు, నమూనా అభివృద్ధి ప్రయోగశాల, శిక్షణా గదులు, స్టూడియో, సహకార కార్యాలయాలు మరియు డిజిటల్ సదుపాయాలతో సేవలు అందిస్తున్నట్లు వివరించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలు, స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో కుప్పం మండలంలోని వెండుగంపల్లెలో ఆర్టీఐహెచ్ రూరల్ అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భవిష్యత్తులో వేగంగా అభివృద్ధి చెందే నూతన సంస్థలకు మరింత మద్దతు అందించడం, ఆర్థిక వనరుల సమీకరణకు అనుసంధానం చేయడం, కేంద్ర వినియోగాన్ని మరింత విస్తరించడం, అలాగే ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహనాలు, వ్యవసాయ మరియు ఆహార ఉత్పత్తులు, వైద్య సాంకేతిక రంగాలలో కనీసం రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ, నూతన సంస్థల అభివృద్ధి, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, పరిశ్రమల భాగస్వామ్యం మరియు ఆవిష్కరణల విస్తరణలో ఆర్టీఐహెచ్ తిరుపతి కీలక పాత్ర పోషిస్తోందని అభినందించారు. యువతలో సృజనాత్మకత, ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడంలో సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *