గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అన్నారు. జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోల్యుషణ్ కంట్రోల్ బోర్డు మరియు హార్ట్ ఫుల్ సెంటర్ వారి ఆధ్వర్యంలో పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ నుండి తారకరామ నగర్ వరకు ప్రజల అవగాహన కొరకు ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని నగర కమిషనర్ జెండా ఊపి ప్రారంభించి, ప్రజలు విధ్యార్ధులతో కలిసి సైక్లింగ్ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎమిషన్స్ (కర్బన వాయువులు) అధికమౌతున్న నేటి తరుణంలో భవిష్యత్ ను కాపాడుకోవాలంటే మనం పర్యావరణ అనుకూలమైన సైకిల్ వాడకాన్ని ప్రజా రవాణా వ్యవస్థగా మేరుగుపరచుకోవాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రజలు ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణానికి అనుకూలమైన అలవాట్లను అలవరచుకోవాలని తెలిపారు. సైకిల్ వినియోగం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని, ఇంధన వినియోగం తగ్గి వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అనేక దేశాల్లో సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నారని, అదే దిశగా గుంటూరు నగరంలో కూడా సైక్లింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేయడానికి ఆలోచనలు చేస్తామన్నారు.
సదరు కార్యక్రమంలో డిప్యూటి కమిషనర్ సి.హెచ్ శ్రీనివాస్, పోల్యుషణ్ కంట్రోల్ బోర్డు ఈ.ఈ నజీనా బేగం, హార్ట్ ఫుల్ సెంటర్ రీజినల్ కో ఆర్డినేటర్ రామచంద్ర రావు, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ తిరుపతి రెడ్డి, యన్.యస్.యస్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ జే. సుదీర్, ఐ.టి.సి నారాయణ, యస్.యస్ సోమశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, విద్యార్ధులు, సీనియర్ సిటిజెన్స్, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News