– 0-6 ఏళ్ల చిన్నారులకు ప్రత్యేక స్క్రీనింగ్
– ఎదుగుదల ఆలస్యాలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు చర్యలు
– ఏఐ ఆధారిత స్క్రీనింగ్తో కార్యకలాపాలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నారులకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో వారి సమగ్ర వికాసానికి నవ చేతన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని.. ఈ కార్యక్రమం విజయవంతానికి సమన్వయ శాఖల అధికారులు సమష్టిగా కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నవచేతన కార్యక్రమంపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ చిన్నారుల్లో ఎదుగుదల ఆలస్యాలు, వైకల్యతను ప్రారంభ దశలోనే గుర్తించి వారికి తక్షణ సహాయక సేవలు అందించేందుకు ప్రభుత్వం నవచేతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని..
ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత మొబైల్, డిజిటల్ టూల్స్ ద్వారా పిల్లల ఎదుగుదల స్థాయిని అంచనా వేయొచ్చన్నారు. చిన్నారుల శారీరక, మానసిక, భాషా, సామాజిక, స్వయం సహాయక నైపుణ్యాలను పరిశీలించి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. పిల్లల ప్రవర్తన, మాట, కదలికలు, సామాజిక నైపుణ్యాలను పరిశీలించి స్క్రీనింగ్ డేటాను యాప్లో నమోదు చేస్తారన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ అవసరమైన పిల్లలను వైద్య, ఇతర నిపుణుల వద్దకు రిఫర్ చేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పిల్లల జీవితంలో మొదటి వెయ్యి రోజులు అత్యంత కీలకమని.. మెదడు అభివృద్ధిలో సుమారు 80 శాతం మూడేళ్లలోపు పూర్తవుతుందని వివరించారు. ఈ దశలో ప్రత్యేక దృష్టిసారించడం ద్వారా చిన్నారులకు భద్రమైన జీవితాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. ఎదుగుదల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా సరైన చికిత్స, థెరపీ, ప్రత్యేక శిక్షణ అందించవచ్చని.. ఈ కార్యక్రమం విజయవంతానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ తదితరాలు పరస్పర సహకారంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
శిక్షణ కార్యక్రమంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, డీఎంహెచ్వో డా. జె.ఇందుమతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. శరత్, ఆర్బీఎస్కే పీవో డా. జి.మాధవి నాయుడు, సీడీపీవోలు భానుమతి, జ్యోత్స్న, లక్ష్మీ భార్గవి, సత్యవతి, పుష్పలత, కృష్ణ కుమారి, సూపర్వైజర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News