విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షం నేపథ్యంలో విజయవాడ నగర పరిధిలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర వైర్లెస్ సెట్ ద్వారా అధికారులను ఆదేశించారు.
కమిషనర్ ఆదేశాల మేరకు మాన్సూన్ రెస్పాన్స్ టీమ్లు (MRTs) వెంటనే అప్రమత్తమై, వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలకు ప్రత్యేక వాహనాలు, గల్ఫర్ మరియు ఎయిర్టెక్ యంత్రాలను తరలించాయి. ముఖ్యంగా బందర్ రోడ్డులోని సోనోవిజన్ సమీప ప్రాంతంలో నిల్వ ఉన్న వర్షపు నీటిని వేగవంతంగా తొలగించి సాధారణ పరిస్థితులను పునరుద్ధరించాయి.
నగరంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు మరియు వర్షపు నీరు నిలిచే ప్రాంతాల్లో మాన్సూన్ రెస్పాన్స్ టీమ్లు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి ఎప్పటికప్పుడు నీటిని తొలగించే చర్యలు కొనసాగించాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు.
వర్షాకాలం మొత్తం నగరంలో నీటి నిల్వల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం 24 గంటల పాటు అప్రమత్తంగా పనిచేస్తోందని అధికారులు తెలిపారు.
Prajavartha Online Telugu News