మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యకర సమాజం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యంగా ఉంటే అంతకు మించిన సంపదలేదని మన చేతుల్లో మన ఆరోగ్యం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంతవరకు ప్రాణాయామాలు చేద్దామని, అవయవాలు ఉన్నంతవరకు ఆసనాలు వేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 7 వ తేదీ నుండి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పలు యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.
ఇందులో భాగంగా ఈనెల 7 వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు మంగినపూడి బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు అని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
అలాగే ఈ నెల 10వ తేదీన ఉదయం 7 గంటలకు గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో లారీ, ఆటోసంఘాల ప్రతినిధులతో కలుపుకొని యోగ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఈనెల 16వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రముఖ నాట్య క్షేత్రమైన మొవ్వ మండలం కూచిపూడి లోని శ్రీ సిద్ధేంద్ర కళాక్షేత్రంలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఈనెల 21వ తేదీన ఉదయం 7 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఉయ్యూరులోని శ్రీ విశ్వశాంతి పాఠశాలలో నిర్వహిస్తామన్నారు.
జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ఒక్కో మాస్టర్ ట్రైనర్ ద్వారా యోగ పై ఆసక్తి ఉన్న 50 మంది ప్రజలకు యోగా శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు.
కావున ప్రజాప్రతినిధులు, ప్రజలు విరివిగా పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.
Prajavartha Online Telugu News