-రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో యోగాంధ్ర-2026 ఉద్యమ కార్యాచరణకు కూటమి ప్రభుత్వం శనివారం నుంచి శ్రీకారం చుట్టింది యోగాంధ్ర పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు గ్రామ/ వార్డు సచివాలయాల స్థాయి నుంచి మొదలైంది. యోగా మాస్టర్ ట్రైనర్లు సుమారు 2వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి కూ డా జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలోని దేవాలయ ప్రాంగణంలో యోగాసనాల రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ప్రారంభించబోతున్నారు. దీనికి అనుగుణంగా 5 జిల్లాల్లో యోగస నాల కార్యక్రమాలు జరగబోతున్నాయి అలాగే ఆదివారం నుంచి ఆరోగ్య సంరక్షణలో యోగాసనాల ప్రాధాన్యం తెలిపేలా రకరకాల ఇతివృత్తాల ఆధారం గా విద్యార్థులకు రకరకాల పోటీలు జరగబోతున్నాయని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.
ఈ నెల 20 వరకు నిరాoటకంగా జరుగుతాయని నేడొక ప్రకటనలో తెలిపారు. 14 రోజుల పాటు నాలుగు వేర్వేరు స్థాయిలలో నాలుగు అంచెల్లో పోటీలను నిర్వహిస్తారని పేర్కొన్నారు.
గ్రామ/వార్డు స్థాయి నుంచి..
గ్రామ/వార్డు స్థాయిలో జూన్ 7 నుంచి జూన్ 9 వరకు, మండల స్థాయిలో జూన్ 10 నుంచి జూన్ 12 వరకు, జిల్లా స్థాయిలో జూన్ 14 నుంచి జూన్ 16 వరకు, జూన్ 18 నుంచి జూన్ 20 వరకు యోగాంధ్ర గ్రాండ్ ఫినాలె పోటీలను నిర్వహిస్తారు. గ్రామ/వార్డు స్థాయిలో విజేతలుగా నిలిచిన వారే వరుసగా మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు. ప్రతి ఒక్కరి టాలెంట్ ను బయటకు తీసేలా కేవలం ఆసనాలే కాకుండా వివిధ రకాల సృజనాత్మక విభాగాలలో కూడా పోటీలు నిర్వహిస్తారు.
ఆసనాల ప్రదర్శన
వ్యక్తిగత ప్రదర్శనల విభాగంలో ఆసనాల ప్రదర్శన, ప్రాణాయామ ప్రదర్శన ఉంటుంది. సమూహ ప్రదర్శనల విభాగంలో సింక్రనైజ్డ్ గ్రూప్ యోగా. కళాత్మక విభాగంలో యోగా సాంగ్ (తెలుగులో సొంత కవిత్వం/పాట), యోగా షార్ట్ ఫిల్మ్, యోగా ఫోటోగ్రఫీ ఉంటాయి. అలాగే యోగా క్విజ్, యోగా స్లోగన్ (నినాదాలు), యోగా వ్యాస రచన పోటీలు ఉంటాయి. జూనియర్స్ ( 10 నుండి 18 సంవత్సరాలు), యువకులు ( 19 నుండి 35 సంవత్సరాలు ), సీనియర్స్ ( 36 సంవత్సరాల పైబడిన వారు) విభాగాల్లో మహిళలకు, పురుషులకు విడివిడిగా పోటీలు నిర్వహిస్తారు. ప్రతి ఆసనాన్ని కనీసం 5 సెకన్ల పాటు స్థిరంగా ప్రదర్శించాలి. ఒక ఆసనం నుండి మరొక ఆసనంలోకి మారే ప్రక్రియ నెమ్మదిగా, శోభాయమానంగా (aesthetic) సాగాలి. మొత్తం ప్రదర్శన సమయం రెండున్నర నుంచి మూడు నిమిషాల పాటు ఉంటుంది. అభ్యర్థి వయస్సు, పేరును నిర్ధారించడానికి ఐడీ కార్డ్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ తప్పనిసరి అందజేయాలి. మైనర్ అభ్యర్థులైతే తల్లిదండ్రులు/గార్డియన్ అండర్టేకింగ్ సంతకం చేయాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో ప్రాథమిక ఆసనాలైన వృక్షాసనం, పాదహస్తాసనం, ఉష్ట్రాసనం, అర్ధమత్స్యేంద్రాసనం, సర్వాంగాసనం, త్రికోణాసనం వంటి వాటిని వయస్సును బట్టి ప్రదర్శించాల్సి ఉంటుంది. స్థాయి పెరిగే కొద్దీ ఆసనాల క్లిష్టత పెరుగుతుంది.
పాల్గొనడం ఎలా?
పోటీలలో పాల్గొనాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులందరికీ ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
పోటీలలో పాల్గొనే వారు “Yogandhra” పోర్టల్ లో పేర్కొన్న వివరాలను పూర్తి చేసి తమ పేరును నమోదు (Register) చేసుకోవాలి. అభ్యర్థులు తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాలను లేదా అధికారులను సంప్రదించి కూడా నమోదు చేసుకోవచ్చు. గ్రామ/వార్డు స్థాయిలో: పంచాయతీ కార్యదర్శి అధికారిక లాగిన్ ద్వారా అభ్యర్థుల వివరాల్ని నమోదు చేస్తారు. మండల స్థాయిలో ఎంపిడీఓ లాగిన్ ద్వారా, జిల్లా స్థాయిలో జిల్లా నోడల్ అధికారి లాగిన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అభ్యర్థులు తాము నివసిస్తున్న/తమ పరిధికి చెందిన ప్రాంతంలోనే పోటీ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, డిగ్రీ కళాశాల మైదానాలు, కమ్యూనిటీ హాళ్లలో ఈ పోటీల వేదికలను ఏర్పాటు చేస్తున్నారు
Prajavartha Online Telugu News