Breaking News

కొన్నిప్రాంతాలలో నైరుతి రుతుపవనాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఐఎండి సమాచారం, ఆర్టీజిఎస్-అవేర్ పోర్టల్ విశ్లేషణ ప్రకారం శనివారం(జూన్ 6) నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జిల్లాల్లోని కొన్నిప్రాంతాలు తాకినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రానున్న 2-3 రోజులు రాష్ట్రంలో మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో కురిసే మొత్తం వర్షపాతం సాధారణ స్థాయి కంటే కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అయితే, స్థానిక వాతావరణ మార్పుల (Local Weather Effects) వల్ల కురిసే వర్షాలు ఈ లోటును కొంత మేరకు భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. కాకపోతే, ఈసారి రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు (Monsoon Breaks) ఏర్పడే అవకాశం ఉందన్నారు. అంటే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి,మరికొన్ని రోజుల పాటు వాతావరణం పొడిగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. రైతులు ఈ మార్పులను గమనించి, తదనుగుణంగా తమ పంట ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు.

నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్-సెప్టెంబర్ 2026) ఆంధ్రప్రదేశ్ లో వర్షపాతం సూచనలు క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.

🟠 సాధారణం కంటే తక్కువ వర్షపాతం:
ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో ముఖ్యంగా పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురము, వైఎస్‌ఆర్ కడప, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

🔵సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం:
ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

🟢 సాధారణ వర్షపాతం:
శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు.

ఇక రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

⛈️ఆదివారం (07-06-2026) పల్నాడు, మార్కాపురం, కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు రేపు శ్రీకాకుళం జిల్లాలో 12 మండలాలు, విజయనగరం 22, మన్యం 12, అల్లూరి1, పోలవరం 2, విశాఖ 1,కాకినాడ 8 మొత్తంగా 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.

వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నమోదైయ్యే మండలాల పూర్తి వివరాలు లింక్లో:
https://apsdma.ap.gov.in/files/b62383960dc19a3c1b4c1063321bcfcf.pdf

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, పోలవరం,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42- 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40- 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు.

⛈️సోమవారం (08-06-2026)
కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఆకస్మికంగా ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ, వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు.

శనివారం కృష్ణా జిల్లా పెదపారుపూడి, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.9, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 43.4, అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి జిల్లా ఓజిలిలో 43.2, మన్యం జిల్లా నవగాంలో 43.1, బాపట్ల జిల్లా కారంచేడు, విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 43డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయిందని తెలిపారు.

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *