– 8,681 వక్ఫ్ సంస్థలు, 82,567 ఎకరాల వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ పూర్తి
– ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమీద్ సెంట్రల్ పోర్టల్ అదనపు 6 నెలల గడువు జూన్ 6 తో ముగిసిందని, పోర్టల్ లో వక్ఫ్ ఆస్తుల నమోదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఘన విజయాన్ని సాధించిందని చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. గడువు ముగిసింది పాత వక్ఫ్ ఆస్తుల నమోదుకేనని నూతన రిజిస్ట్రేషన్ లకు పోర్టల్ అందుబాటులోనే ఉంటుందని తెలిపారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రాష్ట్రంలోని 4,711 వక్ఫ్ సంస్థల నమోదుతో ప్రారంభమైన ఈ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు, సర్వర్ అంతరాయాలు, రికార్డుల కొరత, అంతర్రాష్ట్ర ఆస్తుల వివరాల సేకరణ వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, ప్రత్యేక కార్యాచరణ, నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేయగలిగామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొదటి సర్వే వక్ఫ్ ఆస్తుల వివరాలను 100 శాతం నమోదు పూర్తి చేయడంతో పాటు, రెండవ సర్వేలో గుర్తించి ప్రభుత్వం నుంచి అందిన ఆస్తుల వివరాలను కూడా 100 శాతం ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేశామని తెలిపారు. విస్తృత స్థాయిలో నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, సమీక్ష సమావేశాల ఫలితంగా మొదట నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించి మొత్తం 8,681 వక్ఫ్ సంస్థలు మరియు 82,567.06 ఎకరాల వక్ఫ్ ఆస్తులను ఉమీద్ పోర్టల్లో నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ అందించిన సహకారం, ప్రోత్సాహం, మార్గదర్శకత్వానికి షేక్ అబ్దుల్ అజీజ్ కృతజ్ఞతలు తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందన్నారు. వక్ఫ్ ఆస్తులపై సమగ్ర డిజిటల్ డేటాబేస్ ఏర్పడటం ద్వారా ఆక్రమణల నివారణ, ఆస్తుల రక్షణ, ఆదాయ వృద్ధి, పారదర్శక పరిపాలనకు బలమైన పునాది ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేసిన అధికారులు, సిబ్బంది, జిల్లా ఇన్స్పెక్టర్ ఆడిటర్లు, ముతవల్లీలు, నిర్వహణ కమిటీలు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News