గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుండి 21వ తేదీ వరకు గుంటూరు నగరంలో నిర్వహించనున్న యోగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగరపాలక సంస్థ అధికారులను, సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులకు కమిషనర్ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో సుమారు 5 లక్షల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమాల సమర్థ నిర్వహణ కోసం కార్పొరేషన్ స్థాయిలో యూఎల్బీ కమిటీని, ప్రతి వార్డులో స్వర్ణ వార్డు స్థాయి కమిటీలను ఏర్పాటు చేసామని, యూఎల్బీ కమిటీకి కమిషనర్ చైర్మన్గా వ్యవహరిస్తుండగా, యోగాంధ్ర–2026 కార్యక్రమానికి ఉపా సెల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, కాలనీలు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యం ఉండేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే రోజువారీ యోగా సాధన, ప్రధాన యోగా ప్రదర్శనలకు అనువైన వేదికలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వార్డు స్థాయి ప్రత్యేక అధికారులు ప్రతిరోజూ యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించి, సంబంధిత ఫోటోలు మరియు నివేదికలను జీఎంసీ యోగాంధ్ర హెల్ప్డెస్క్కు పంపాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News