గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజల శారీరక, మానసిక ఉల్లాసం మరియు ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర 2026’ కార్యక్రమాలను గుంటూరు నగరంలో మరింత వేగవంతం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేశామని, ఇందులో భాగంగా యోగా రంగంలో నిపుణులైన మాస్టర్ ట్రైనర్ల ద్వారా ఒక్కో సచివాలయంకు 17 మంది చొప్పున మొత్తం 3518 శిక్షకులకు (ట్రైనర్స్) ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణ పొందిన వారు సచివాలయాల పరిధిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ యోగాపై అవగాహన కల్పించడానికి 1849 కేంద్రాలను గుర్తించామని పేర్కొన్నారు. దీనితో పాటు నగరంలోని ప్రతి సచివాలయ పరిధిలోనూ ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులను మరియు యువతను భాగస్వామ్యం చేస్తూ విభిన్నమైన పోటీలను ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేవలం యోగాసనాల పోటీలు మాత్రమే కాకుండా, యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పే విధంగా డ్రాయింగ్ (చిత్రలేఖనం), స్లోగన్స్ (నినాదాలు రాయడం), పాటల పోటీల్లో 912 మంది పాల్గొన్నారన్నారు. ఈ పోటీలతో పాటు ‘యోగాంధ్ర’ ఆశయాలను ప్రతి ఇంటికీ చేరవేయడానికి నగరవ్యాప్తంగా పౌరుల నమోదు (సిటిజన్ రిజిస్ట్రేషన్లు) ప్రక్రియను కూడా అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
గుంటూరు నగర ప్రజలు, మహిళలు, యువత మరియు విద్యార్థులు ఈ ‘యోగాంధ్ర 2026’ సచివాలయ స్థాయి పోటీలలో మరియు సిటిజన్ రిజిస్ట్రేషన్లలో మరింత ఆసక్తితో, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. గుంటూరు నగరాన్ని ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఈ పోటీలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News