-రాష్ట్ర ప్రజల ఆశీస్సులే అండగా నిలిచాయన్న గవర్నర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా నుండి కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం మధ్యాహ్నం విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, వైద్యుల సేవల ఫలితంగానే త్వరితగతిన కోలుకున్నానని వివరించారు. వాక్సిన్ ఎంతో ఉపయోగపడిందని, సకాలంలో రెండు డోసుల వాక్సిన్ తీసుకోవటం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రజలు కరోనా విషయంలో జాగ్రత్త వహించాలని, తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఎటువంటి అశ్రద్ద కూడదని పేర్కొన్నారు. తప్పని సరిగా ముఖముసుగును ధరించటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరాన్ని పాటించటం వంటివి మరి కొంత కాలం కొనసాగించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వివరించారు. గవర్నర్ కు స్వాగతం పలికిన వారిలో రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు ఉన్నారు.
Prajavartha Online Telugu News