– ప్రయాణీకుల సౌలభ్యానికే ప్రాధాన్యత : ఆర్టీసీ ఎండీ తిరుమల రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పండుగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్కు గడువును పొడిగించింది. దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ గడువును పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ముందస్తు రిజర్వేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. గురువారం నుంచి ఈ గడువును 60 రోజులకు పొడిగిస్తూ ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప, అనంతపురం వంటి దూర ప్రాంతాలు వెళ్లే బస్సులలో ఈ ముందస్తు రిజర్వేషన్కు అవకాశం కల్పించినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పర్వదినాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఆర్టీసీ ఎండీ తిరుమల రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
Prajavartha Online Telugu News