-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్
-భారతదేశంలో పర్యావరణ చట్టం-ఒక పునఃపరిశీలన అనే అంశంపై మేధావుల సదస్సు
-పర్యావరణ చట్టాల ఆవశ్యకతను ఉటంకించిన పలువురు న్యాయమూర్తులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, నియంత్రణ ప్రభుత్వాలు తమ పౌరులకు అందించే ప్రజా సేవల్లో కీలకమైనవని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పర్యావరణ చట్టాలు కాలుష్యానికి కారణమయ్యే వ్యర్థ పదార్థాలను బాధ్యతాయుతంగా నిర్మూలించేలా చూస్తాయన్నారు. భారత మేధావుల సదస్సు (ఐసీఓఐ) ఆధ్వర్యంలో శుక్రవారం గేట్వే హోటల్లో “భారతదేశంలో పర్యావరణ చట్టం-ఒక పునఃపరిశీలన” అనే అంశంపై జరిగిన సమావేశానికి గవర్నర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సు ప్రతినిధులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని నొక్కి చెప్పవలసి ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణలో సహజ వనరుల సమతుల వినియోగం అత్యంత కీలకమైన అంశమని, అంతర్జాతీయ స్దాయి కట్టుబాట్లు సైతం ఇదే విషయాన్ని వెల్లడి చేస్తున్నాయని వివరించారు. పర్యావరణ పరిరక్షణ పరంగా భారత రాజ్యాంగంలోని 51ఎ ను అనుసరించి అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం దేశంలోని ప్రతి పౌరుడి విధిగా ఉందన్నారు. భారత రాజ్యాంగంలోని 48ఎ పర్యావరణాన్ని రక్షణ విషయంలోనే కాక, దేశంలోని అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి రాష్ట్రాలు ప్రయత్నించాలని నిర్దేశిస్తుందని గుర్తు చేసారు. కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఇతర అంశాలలో సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా పర్యావరణ చట్టాలను రూపొందించారని గౌరవ గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు.
కర్ణాటక, గౌహతి హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి (యాక్టింగ్) జస్టిస్ కె. శ్రీధర్ రావు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణ మోహన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ చైర్మన్ జస్టిస్ బి. శివశంకరరావు, ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి తదితర ప్రముఖలు ఈ సదస్సుకు హాజరయ్యారు. పిఐబి నుండి జె.కె.ఫరీడా, లోక్ సభ మాజీ ప్రధాన కార్యదర్శి పి.డి.టి.ఆచారి, ఐసీఓఐ ప్రధాన కార్యదర్శి కె.ఎం.శివశంకరాచార్, గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఎపిఎస్ ఆర్టీసి ఎండి ద్వారకా తిరుమలరావు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎస్. సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.