-ఉ.9.30 గం.ల నుంచి మ.12.45 గం.ల వరకు
-జిల్లాలో 7,933 మంది విద్యార్థులు హాజరు
-45 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
-45 చీఫ్ సూపరింటెండెంట్లు, 45 మంది డిపార్ట్ మెంటల్ అధికారులు నియామకం
-456 మందికి పైగా ఇన్విజిలేటర్లు 3 ప్లెయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు
-జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఉదయం కలెక్టరేట్లోని డిఆర్వో చాంబర్ లో 10వ తరగతి సప్లమెంటరీ పరీక్షల నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై విద్య, రెవెన్యూ, పోలీస్, ఏపీఎస్ ఆర్ టిసి, వైద్య ఆరోగ్య, నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6వ తేదీ నుంచి జరగబోయే 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాసే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లాలో 7,933 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనున్నారని, పరీక్షల నిర్వహణకు 45 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉ.9.30 గం.ల నుంచి మ.12.45 గం.ల వరకు పరీక్షలు జరుగుతాయని, నిర్వాహకులతో పాటు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకొనే విధంగా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, శానిటేషన్ వంటి ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. కోవిడ్ దృష్ట్యా పలు జాగ్రత్తలు తీసుకొని ఓఆర్ ఎస్ పాకెట్లు, అవసరమైన మందులను పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. పరీక్షలు జరిగే సమయాలలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్ధులు సమయానికి చేరుకొనే విధంగా ఆయా కేంద్రాల రూట్లలో బస్సులను నడపడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఎటువంటి జిరాక్స్ సెంటర్లు తెరచి ఉండకుండా, పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు పరచే విధంగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆయన ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా సబ్ ఇన్ స్పెక్టర్ స్థాయి పోలీస్ అధికారులు, రెవెన్యూ, విద్యాశాఖకు చెందిన అధికారులతో ఫ్లైయింగ్ స్క్వాడ్ పర్యవేక్షించాలన్నారు. విద్యార్ధులు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పరీక్షా కేంద్రాలలోకి తీసుకురానివ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా అమలు చేస్తూ పరీక్షలు సజావుగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారిణి తహేరా సుల్తానా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News