-ఆహలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో- కన్వీనర్ అల్తాఫ్ రజా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి షా బుఖరి దర్గా తరఫున నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం షెడ్డు పై ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఇచ్చిన నోటీస్ పై నేడు వివరణ ఇచ్చేందుకు విజయవాడ లోని వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయా నికి వచ్చారు ఆహలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో- కన్వీనర్ అల్తాఫ్ రజా. వక్ఫ్ బోర్డు కార్యాలయంలో వివరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం తప్ప తమకు వేరే ఉద్దేశ్యం లేదన్నారు. షా బుఖారి దర్గా మసీద్ అభివృద్ధి విషయంలో కొండపల్లి గ్రామ ప్రజలు, అల్లాహ్ భక్తులు తప్ప వక్ఫ్ బోర్డు చేసిందేమీ లేదన్నారు. విజయవాడ కు చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమకు నోటీస్ ఇవ్వడం సబబు కాదని, స్మశానం ఆక్రమణకు గురైంది వాదనలో వాస్తవం లేదన్నారు. వక్ఫ్ బోర్డు అధికారులు వచ్చి పరిశీలించు కోవచ్చునని ఇందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. చాలా కాలంగా వక్ఫ్ బోర్డు రికార్డ్ పరంగా స్థలం సర్వే చేయాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ వ్యవహారశైలి పై తమకు అభ్యంతరం ఉందన్నారు. వివాదాస్పదాలు తప్ప, ముస్లింలకు లబ్ది చేకూరే నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు.
వందలాది ఎకరాల ఆక్రమించుకున్న వారిని వదిలివేసి షెడ్డు వేసుకుని నిత్యాన్నదాన కార్యక్రమం చేస్తున్న తమకు నోటీస్ ఇవ్వడం వేధింపు చర్యలకు పాల్పడటంమే అని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు స్థలాలను కాపాడేందుకు తాము చేస్తున్న పోరాటం కొనసాగుతుందన్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో చేసిన వాగ్దానాలు ప్రకటనలు అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు?వక్ఫ్ బోర్డు వ్యవహారాలు పై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆక్రమణకు గురైన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకునే ధైర్యం ఉందా అని సవాల్ చేశారు. కేవలం సున్ని జమాత్ వారికి వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానం లో కేసు ఫైల్ చేసిన కారణంగానే ఇటువంటి వేధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని ఆ అల్లాహ్ దయతో షాబుఖారీ నిత్య అన్నదాన లంగర్ ఖానా నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.
Prajavartha Online Telugu News