-దేశవ్యాప్తంగా తయారైన హస్తకళ రూపాలు ఒకే వేదికపై ప్రదర్శన..
-హస్త కళలను అదరించి కళాకారులను ప్రోత్సహించండి..
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ సాంస్కృతి సాంప్రదాయలకు ప్రతి రూపమైన ప్రాచీన హస్త కళలను అదరించి హస్త కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని దేశవ్యాప్తంగా కళా నైపుణ్యంతో రూపొందించి ఉత్పత్తులను ఒకే వేదికపై ప్రదర్శించి అమ్మకాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ హస్త కళాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పిన్నమనేని పాలిక్లీనిక్రోడ్డులోగల సిద్దార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి హస్త కళాల ప్రదర్శన లేపాక్షి క్రాప్ట్ బజార్ `2023 ను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ వెలంపల్లి శ్రీనివాసరావులు ప్రారంభించారు. ప్రదర్శనను తిలకించిన అనంతరం జిల్లా కలెక్టర్ మట్లాడుతూ ప్రాచీన హస్త కళలు భారతీయ సాంస్కృతి సాంప్రదాయలకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రలకు చెందిన హస్త కళాకారులు కళ నైపుణ్యంతో వినియోగదారులను ఆకర్షించే విధంగా ఉత్పత్తులను తయారు చేయడం అభినందనీయమన్నారు. ఎంతో వ్యయ ప్రయాసలను తట్టుకుని హస్త కళల పై ఉన్న మక్కువతో కళాకారులు హస్త కళారూపాలకు జీవం పోస్తున్నారన్నారు. అటువంటి వారిని అదరించి ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్ మాట్లాడుతూ హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. హస్త కళరూపాలకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు క్రాప్ట్ బజార్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం హస్త కళాకారులకు వైఎస్సార్ పేరుతో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పద్మశ్రీ అవార్డులను అందజేయడం జరిగిందన్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయనున్న అబేంద్కర్ స్మృతివనం కాంప్లెక్స్ లో రాష్ట్రానికి చెందిన హస్త కళాకారులు రూపొందించి కళారూపాలను ప్రదర్శించి అమ్మకాలు నిర్వహించుకునేలా ప్రత్యేక స్టాల్ను ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువస్తానన్నారు.
శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ హస్త కళాకారులు అత్యంత కళ నైపుణ్యంతో తయారు చేసిన వస్తువులను సుమారు 100 పైగా స్టాల్స్ నందు ప్రదర్శించి అమ్మకాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రానికి చెందిన వారే కాక దేశ వ్యాప్తంగా జాతీయ అవార్డులు పొందిన చేతి వృత్తి కళాకారులు వారు తయారు చేసిన ఉత్పత్తులను క్రాప్ట్ బజారులో ప్రదర్శిస్తున్నారని ఈ అవకాశాన్ని హస్త కళల అభిమానులు సద్వినియోగం చేసుకుని కళాకారులను ప్రోత్సహించాలన్నారు.
హస్త కళల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యం. విశ్వ మాట్లాడుతూ దేశంలోని కర్నాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, రాజస్థాన్, మహారాష్ట్ర, బిహార్, ఒరిస్సా, తెలంగాణ తదితర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో పేరుగాంచిన హస్త కళా ఉత్పత్తులను ప్రదర్శనలో ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహించనునట్లు ఆయన తెలిపారు. ప్రదర్శనలో తెలుగు రాష్ట్రలకు చెందిన కలంకారి, ప్రింటింగు, పెయింటింగులు, కొండపల్లి, ఏటికుప్పాక బొమ్మలు, లేసు అల్లికలు, చెక్కతో తయారైన కళాకృతులు, టెర్రకోటపాటరీలు, తాటియాకు వస్తువులు, తివాచీలు, కేన్ వస్తువులు, మంగళగిరి చీరాల చేనేత వస్త్రాలు, హైదరాబాద్ ముత్యాలు, బ్లాక్ మెటల్ వస్తువులు, ఉడెన్ కట్లరీ వస్తువులు నిర్మల్ పెయింటింగ్ తో పాటు ఇతర రాష్ట్రలకు చెందిన చికన్ ఎంబ్రాయిడరీ, గాజు ఆభరణములు, మధుబని పెయింటంగ్స్, బ్లూ పాటరీ వస్తువులు, చిత్రపటాలు, సిల్వర్ పిలిగ్రీ, లక్క గాజులు, డోక్రా కేస్టింగ్, డ్రై ప్లవర్స్ వంటి అనేక కళా రూపాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.
హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బి. విజయలక్ష్మి మాట్లాడుతూ హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన క్రాప్ట్ బజార్ను ప్రతి ఒక్కరూ సందర్శించాలని కోరారు. ఈనెల 26వ తేది వరకు ప్రదర్శన ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సెలవు రోజులలో కూడా కొనసాగుతుందని ఆమె తెలిపారు.
క్రాప్ట్ బజార్ ప్రారంభ కార్యక్రమంలో లేపాక్షి ఒఎస్డి లక్ష్మినారాయణ, మేనేజర్ యం సురేష్, ఎగ్జిబిషన్ ఇన్ఛార్జి మేనేజర్ బి. శైలజ, హస్త కళల అభివృద్ధి సంస్థ మరియు లేపాక్షి అధికారులు సిబ్బంది వివిధ రాష్ట్రాలకు చెందిన హస్త కళాకారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News