-రాజమండ్రిలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య కళాశాల నిర్మాణం
-ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పరిశీలించిన ఎంపీ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి నగరంలో అత్యంత ఆధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. మంగళవారం నగరంలోని సెంట్రల్ జైల్ ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్రంలో 16 వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేయగా, వీటిలో అయిదు కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం లలో నిర్మిస్తున్న వైద్య కళాశాలల భవనాలకు కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 11 వైద్య కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని ఎంపీ భరత్ తెలిపారు. మొన్నటి కరోనా విపత్కర పరిస్థితులలో వైద్యం కోసం ప్రజలు ఎంతలా ఆందోళన చెందారో, ఎంత సొమ్ము ప్రైవేటు ఆసుపత్రులకు సామాన్యులు వెచ్చించి ఆర్థికంగా చితికిపోయారో అందరికీ తెలిసిందేనన్నారు. భవిష్యత్తులో అటువంటి అవస్థలు ఎవరూ పడకూడదనే ఉద్దేశంతో విద్యా, వైద్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని చెప్పారు. సుమారు మూడెకరాల విశాలమైన స్థలంలో జీ ప్లస్ 1 వైద్య కళాశాలను రాజమండ్రి నడిబొడ్డులో నిర్మించడం నగరానికే తలమానికమన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఈ భవనం పూర్తయి రానున్న విద్యా సంవత్సరం ఆరంభం నుండి వైద్య విద్యార్థుల తరగతులు కూడా ఈ భవనంలోనే ప్రారంభం అవుతాయని ఎంపీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ ఎస్ఈ ఎస్ సుబ్రహ్మణ్యం, ఈఈ కే విజయ భాస్కరరెడ్డి, ఎంఈఐఎల్ ఉపాధ్యక్షుడు పీ మణికుమార్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News