అనపర్తి( బలబద్రపురం), నేటి పత్రిక ప్రజావార్త :
ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ గ్రాసిమ్ పరిశ్రమ విస్తరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సూచనలు, సలహాలు అన్నింటినీ పరిగణనలోనికి తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో గ్రాసం ఇండస్ట్రీస్ విస్తరణలో భాగంగా జిల్లా కలెక్టర్ మాధవీలత ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం బలబద్రపురం హైస్కూల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రజాభిప్రాయం మేరకు నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయడం జరుగు తుందన్నారు. సదరు నివేదికపై ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కంపెనీ విస్తరణకు సంబంధించిన కార్యాచరణను అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ఉత్పత్తిని ఒక రోజుకు 400 టన్నులను కెపాసిటీ నుండి 1000 టన్నులకు కెపాసిటీకి పెంచేందుకు కంపెనీ ప్రతిపాదన రూపొందించింది అన్నారు. ఇప్పటివరకు ఈ కంపెనీలో రూ.1287 కోట్లు కంపెనీకి పెట్టుబడిగా పెట్టడం జరిగిందన్నారు. విస్తరణలో భాగంగా ఇప్పటికే కేటాయించిన 240 ఎకరాల్లో 68 ఎకరాల్లో కంపెనీ విస్తరణ పనులు చేపడుతున్నారని, ఇందుకు గాను మరో 2400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కంపెనీ విస్తరణను చేపడుతున్నారన్నారు. ఈ విస్తరణ ద్వారా జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే ఉన్న కంపెనీ నుండి కాలుష్యంతో కూడిన నీరు బయటకు రాకుండా జీరో లిక్విడ్ డిఛార్జ్ పద్ధతిని పాటిస్తున్నారని, అదేవిధంగా నూతనంగా విస్తరించే యూనిట్ జీరో లిక్విడ్ రీఛార్జ్ విధానాన్ని పాటిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా బలబద్రపురం గ్రామంలో ఫ్యాక్టరీ పొల్యూషన్ పై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ద్వారా గ్రాసం ఇండస్ట్రీస్ విస్తరణ పై పలువురు తమ అభిప్రాయాన్ని తెలియజేశారని పేర్కొన్నారు. సేకరించిన ప్రజాభిప్రాయాలను రికార్డ్ చేయడం జరిగిందన్నారు. తదుపరి వాటిని ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. అనంతరం వారి నివేదిక, మార్గదర్శకాల ఆధారంగా తదుపరి కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన స్థానిక శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ శాసన సభ్యులు నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇంజనీర్ ఎన్. అశోక్ కుమార్, గ్రాసం పరిశ్రమ లిమిటెడ్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు జీ ఎం మురళీధర్, మేనేజర్ మురళి కృష్ణ, పరిసర ప్రాంతాల బిక్కవోలు, పెదపూడి, రంగంపేట, అనపర్తి గ్రామాల ప్రజలకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News