రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి.ఆర్.రాజీవ్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి ప్యానెల్ లాయర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ సభ్యులతో మానిటరింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. న్యాయ సేవలు అవసరమైన వారికి మెరుగైన, సత్వరమైన పరిష్కారం చూపించడం ప్యానెల్ లాయర్ల ప్రధాన కర్తవ్యమని న్యాయమూర్తి రాజీవ్ అన్నారు. ఈ విషయంలో సమస్యలు, సందేహాలు ఉంటే వెంటనే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని వారు పేర్కొన్నారు. న్యాయ సేవాధికార సంస్థల చట్టం, 1987 పై న్యాయవాదులకు స్పష్టమైన అవగాహన ఉండాలని, ఉచిత న్యాయ సహాయం పొందే అర్హత ఉన్నవారికి మెరుగైన న్యాయ సేవలు అందించాలని చెప్పారు. రాజమహేంద్రవరం లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ ఏర్పడిన నాటి నుండి వారు చెప్పటిన కేసులు ఏ దశలో ఉన్నాయనే వాటిపై న్యాయమూర్తి ప్రత్యూష కుమారి ఆరా తీశారు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా పని చేయాలని సూచించారు. ప్యానెల్ లాయర్లు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ సభ్యులు సత్వర న్యాయ సేవల వల్ల ప్రజలలో న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం బలపడుతుందని అన్నారు.
Prajavartha Online Telugu News