మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగనన్న ఆణిముత్యాల కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, డిఆర్వో ఎం వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న ఆణిముత్యాలు, గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ, జగనన్నకు చెబుదాం, గృహ నిర్మాణము, రీ సర్వే తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నియోజకవర్గాలు, జిల్లాస్థాయిలో అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రజలందరినీ భాగస్వాములు చేయాలన్నారు.
ఈనెల 15వ తేదీన నియోజకవర్గాల స్థాయిలో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులతో సంప్రదించి అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించాలన్నారు.
అలాగే ఈనెల 17వ తేదీ జిల్లాస్థాయిలో కూడా జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సజావుగా చేయాలన్నారు.వివిధ ప్రభుత్వ యాజమాన్యాల వారీగా అత్యుత్తమ మార్కులతో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థినీ విద్యార్థులను అభినందించాలన్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పతకాలు, ప్రశంసా పత్రాలు ఇతర సామాగ్రిని వెంటనే సమకూర్చుకోవాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్లో ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దారులు, తదితర అధికారులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News