విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో దివంగతనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని బుధవారం మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో పలువురు మంత్రులు, వైసీపీ నాయకులు, రైతులు పాల్గొని ముందుగా దివంగతనేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దివంగతనేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఈనెల 8న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా`పీఎం కిసాన్, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ యంత్ర సేవా పథకం వంటి పథకాలు చారిత్రాత్మకమన్నారు. రైతు భరోసా కేంద్రాల్లోనే ఆయా పథకాలకు సంబంధించిన పూర్తి ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందన్నారు. రైతులకు దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలలో లేని విధంగా పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు. రైతుల అభ్యున్నతికి సహకార సంఘాల పాలక కమిటీలు కృషి చేయాలని సూచించారు. రైతులను గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం హయాంలో కేడీసీసీ బ్యాంక్ ద్వారా సహకార రంగాన్ని ఎంతో బలోపేతం చేశామన్నారు. కేడీసీసీ బ్యాంక్ దేశంలోనే 5వ అతిపెద్ద డీసీసీబీగా గుర్తింపు పొంది ఉత్తమ అవార్డు అందుకుందన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 184 సహకార భవనాలు నిర్మాణం చేపట్టామన్నారు. అనంతరం కేడీసీసీబీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు మరియు పాలక మండల సభ్యులు, ముఖ్య అతిధులుగా విచ్చేసిన వారు కృష్ణాజిల్లా పరిధిలోని ప్రతి మండలంలో నుంచి ఒకరు చొప్పున వ్యవసాయ శాఖ ద్వారా ఎంపిక చేసిన 54 మంది ఉత్తమ రైతులకు కేడీసీసీబీ ద్వారా రూ.10 వేల నగదు పురస్కారం, జ్ఞాపికను, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్కుమార్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణ నిధి, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, కేడీసీసీబీ డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్, సిబ్బంది, భారీ సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News