-ఎన్నికల విధుల్లో ప్రతి దశలోనూ అప్రమత్తత అవసరం
-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి పూర్తిస్థాయి అవగాహన, నిబద్ధత ముఖ్యమని ప్రతి దశలోనూ అప్రమత్తత అవసరమని కలెక్టర్ ఎస్.డిల్లీరావు పేర్కొన్నారు.
విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలేజీ సమావేశ మందిరంలో అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్వో)లకు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ జరిగింది. ఏఆర్వోలకు అయిదు రోజుల శిక్షణ కార్యక్రమంలో జాతీయస్థాయి మాస్టర్ ట్రైనర్లు వేద్ప్రకాష్, ఆర్బీ జ్ఞానవేలు, జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, డీఆర్వో వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఇప్పటికే రెండు దశల శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని.. మూడో దశ శిక్షణ కార్యక్రమం ఫిబ్రవరి 26 నుంచి అయిదు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, శ్రీ ఎస్పీఎస్ నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించి 118 మంది ఏఆర్వోలకు జరిగే శిక్షణ కార్యక్రమంలో జాతీయస్థాయి మాస్టర్ ట్రైనర్లు.. ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల అర్హత, అనర్హత, నామినేషన్ల పరిశీలన, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం-వీవీప్యాట్ అడ్మినిస్ట్రేషన్, కౌంటింగ్-డిక్లరేషన్ ప్రాసెస్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మీడియా మానిటరింగ్ కమిటీ, ఎన్నికల నైతిక నియమావళి (ఎంసీసీ), సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ అంశాలను సరైన విధంగా అర్థం చేసుకొని లాజికల్గా గుర్తుంచుకొని వాటిని ప్రాక్టికల్గా అమలుచేయడంలో విజయవంతం కావాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో పనిచేయడం ద్వారా, సరైన మార్గనిర్దేశనం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించవచ్చని కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News