గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ 2024-25 సంవత్సరానికి రూ.1497.14 కోట్ల అంచనాలతో శనివారం నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ ను ఆమోదించారు. నగర కమిషనర్ కీర్తి చేకూరితో కలిసి నగరపాలక సంస్థ విభాగాదిపతులతో మరియు ఆడిట్ అధికారులతో 2023-24 ఆర్ధిక సంవత్సరంకు సంబంధించి రివైజ్డ్ బడ్జెట్ మరియు 2024-25 కు సంబంధించిన అంచనాలతో రూపొందించిన బడ్జెట్ పై మేయర్ చాంబర్ లో స్టాండింగ్ కమిటి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ 2023-24 ఆర్దిక సంవత్సరం 634.56 కోట్ల ప్రారంభ నిల్వతో పాటు వార్షిక ఆదాయం రూ.612.62 కోట్లతో కలిసి రూ.1247.19 కోట్లతో కౌన్సిల్ ఆమోదం చేసి ఉంది. అందులో 578.62 కోట్లు ఖర్చులు పోగా, అంత్య నిల్వ రూ.669.56 కోట్లుగా కలదన్నారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ప్రారంభ నిల్వ రూ.669.56కోట్లు ఉండగా, నగరపాలక సంస్థ సంవత్సరానికి సంబందించిన ఆదాయం రూ.828.57 కోట్లు అంచనాతో రూ.1497.14 కోట్లతో నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ ని స్టాండింగ్ కమిటి ఆమోదించిందని పేర్కొన్నారు. రూ.923.47 కోట్లు ఖర్చులు పోగా అంత్య నిల్వ 573.66 కోట్లు ఉంటుందని తెలిపారు. త్వరలో జరిగే కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ ను కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు.
సమావేశంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, వెంకట లక్ష్మీ, విభాగాధిపతులు, స్టాండింగ్ కమిటి సభ్యులు షేక్ మహమూద్, సంకురి శ్రీనివాసరావు, కండ్రగుంట గురవయ్య, శ్యామల వెంకట రమణాదేవి, మల్లిబోయిన శ్రీవల్లి, పాపతోటి అంబేద్కర్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News