– ఎన్నికల నిర్వహణకు పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికల నిర్వహణకు పటిష్ట ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని.. వివిధ ఫారాలను మార్గదర్శకాలకు అనుగుణంగా సజావుగా పరిష్కరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కమార్ మీనా.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులు, సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. సీపీ కాంతిరాణా టాటా, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ హాజరయ్యారు. త్వరలో ఎన్నికల షెడ్యూలు రానున్న నేపథ్యంలో నిష్పక్షపాత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ముఖేష్ కుమార్ మీనా దిశానిర్దేశం చేశారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే అమల్లోకి రానున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని పటిష్టంగా అమలుచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు.. జిల్లాలో పెండింగ్ ఫారాల పరిష్కారం; ఎపిక్ జనరేషన్, ప్రింటింగ్, పంపిణీ; మీడియా రిపోర్టులు, ఫిర్యాదులపై కార్యాచరణ తదితర వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News