విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంగన్వాడి ని ప్రభుత్వ విభాగం చెయ్యాలని, బడ్జెట్ తగినంత కేటాయించాలని, అంగన్వాడీ టీచర్లు ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆలిండియా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎ ఆర్ సింధు డిమాండ్ చేశారు. స్థానిక గవర్నర్ పేట ఎంబి విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ఆదివారం అంగన్వాడీ స్వర్ణోత్సవాల సందర్భంగా రాష్ట్ర సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సింధు నేటికీ 80శాతం పేదరికం లో ఉండి , వారిలో 70 నుండి 80 శాతం పోషకాహార లోపం తో ఉన్నారని చెప్పారు. ప్రపంచ ఆకలి సూచి లో భారత్ స్థానం దిగజారటమే నిదర్శనం అన్నారు. అంగన్వాడీ వ్యవస్థ ను పధకం గా కొనసాగించటమే దీనికి కారణమన్నారు. బిజెపి మోదీ ప్రభుత్వం గత పదేళ్ళలో ఈ పధకం కు తగిన నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నదని తెలిపారు. టెక్నాలజీ ని వాడి, అంకెల గారడీ చేసి వాస్తవ పరిస్థితి మరుగు పరుస్తున్నారన్నారు. ఈ అక్టోబర్ 2 నుండి వచ్చే అక్టోబర్ 2 వరకు ఐసిడిఎస్ స్వర్ణోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలు ఆందోళనలు చేపట్టనున్నామని ప్రకటించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి హెచ్ నర్సింగ రావు మాట్లాడుతూ 42 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వద్దకు అంగన్వాడీల సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.ఈ సదస్సుకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి బేబి రాణి అధ్యక్షత వహించారు.5వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ కే ధనలక్ష్మి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి అంగన్వాడి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావమ్మ సదస్సులో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News