– భారతదేశంలో ఉన్నత విద్యా ప్రమాణాలు కలిగిన ఐఐటి స్థాపనలో ముఖ్యులు ఆజాద్
– ముఖ్య అతిథిగా హాజరైన డి ఆర్ వో రామచంద్ర మూర్తి, ఇతర మైనార్టీ సంఘాల ప్రతినిధులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత తొలి విద్యా మంత్రి భారతరత్న జనాబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సదా స్మరణీయుడని, అటువంటి మహోన్నత వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందాలని జిల్లా రెవిన్యూ అధికారి టి. రామచంద్రమూర్తి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలక్టరేట్ సమావేశ మందిరంలో 137 వ జనాబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా డి ఆర్ వో, ఇతర మైనార్టీ అధికారులు, సంఘాల ప్రతినిధులు , మైనార్టీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి టి. శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ, 1948 నుంచీ 1958 వరకూ 10 సంవత్సరాలు పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి గా ఆయన అందించిన మార్గనిర్దేశం నేటికీ సమర్థవంతంగా అమలు చేస్తున్న తీరే నిదర్శనం అన్నారు. బలమైన దృఢ విశ్వాసం మరియు ధృడమైన ముందు చూపుతో భారతదేశ విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను అమలు చేశారు. సమాజంలోని పేద వర్గాలకు, ముఖ్యంగా గ్రామీణ జనాభాకు మరియు బాలికలకు విద్య యొక్క ప్రాముఖ్యతపై ఆయన నొక్కిచెప్పారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛైర్మన్గా ఆయన బహుళ సంస్కరణలకు ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. వయోజన అక్షరాస్యత, సార్వత్రిక ప్రాథమిక విద్య, బాలికల విద్య, 14 సంవత్సరాల వరకు ఉచిత మరియు నిర్బంధ విద్య, మరియు మాధ్యమిక విద్య మరియు వృత్తిపరమైన శిక్షణ అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వలని ఆనాడే నొక్కి చెప్పడం తో పాటు వాటిని ఆచరణ లో చూపడమే ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం అని రామచంద్ర మూర్తి పేర్కొన్నారు. ఆయన హయంలో విద్యా మంత్రిత్వ శాఖ 1951లో మొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని మరియు 1953లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ను స్థాపించిందని పేర్కొన్నారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు ఢిల్లీ యూనివర్శిటీ యొక్క ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ అభివృద్ధిపై కూడా ఆయన దృష్టి పెట్టారన్నారు . ఆనాడే భారతదేశానికి ఐఐటిలలో గొప్ప భవిష్యత్తును ముందే ఊహించి, దేశ విద్యా ప్రమాణాలు అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన మరణం తరువాత ఆయన సేవలకు గుర్తింపుగా 1992 లో భారత ప్రభుత్వం భారత రత్న అవార్డు తో సత్కరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి, అబుల్ కలామ్ ఆజాద్ చిత్ర పటానికి ఫోటోకి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలు ప్రార్థన చెయ్యడం జరిగింది. తదుపరి కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి సునీల్ కుమార్, మైనార్టీ ప్రతినిధులు ఎస్ కె అసాధుల్లా అహమ్మద్, ఎస్కే అబుల్ కవీన్, ఎండీ అబుల్ రాజ్జాఖ్, శ్రీనివాస్, ముస్లిం , క్రిస్టియన్ సంఘాల మత గురువు లు , తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News