గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏబిసి సెంటర్ లో ప్రతి రోజు వంద వీధి కుక్కలకు తగ్గకుండా ఆపరేషన్లు చేయాలని, అందుకు తగిన మౌలిక వసతులను జిఎంసి కల్పించిందని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఎయస్ ఏబిసి ఏజన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. బుధవారం కమిషనర్ నల్లచెరువు రోడ్ లోని జిఎంసి ఏబిసి సెంటర్ ని, కెవిపి కాలనిలోని వెహికిల్ షెడ్ ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏబిసి (యాంటి బర్త్ కంట్రోల్ సెంటర్) సెంటర్ లో ప్రతి రోజు 100 వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టాలని ఏజన్సీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. సదరు ఆపరేషన్లకు అవసరమైన వసతులను జిఎంసి కల్పించిందని, అదనపు వైద్యులను, సిబ్బందిని కేటాయించి ఆపరేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సెంటర్ లో పరిశుభ్రత పాటించాలని, ఆపరేషన్ అనంతరం సంరక్షణ సమయంలో కుక్కలకు తగిన ఆహారం అందిస్తూ, పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సెంటర్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని, అనుమతి లేకుండా ఇతరులు లోనికి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో ప్రతి వారం యానిమల్ లవర్స్ ఏబిసి ప్రక్రియ పరిశీలనకు అనుమతి ఇస్తామని తెలిపారు.
అనంతరం వెహికిల్ షెడ్ ని పరిశీలించి, షెడ్ ప్రాంతాన్ని సమగ్రంగా సర్వే చేయాలని, సర్వే అనంతరం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలని ఈఈని ఆదేశించారు. ట్రాన్స్పోర్ట్ అధికారులతో సమన్వయం చేసుకొని గడువు ముగిసిన వాహనాలను కండెం చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పాత ఇనుప సామాను, టైర్లను ఈ-ఆక్షన్ చేయాలన్నారు.
పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, సిఎంఓహెచ్ డాక్టర్ శోభారాణి, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, డిఈఈ సతీష్ కుమార్, ఏఎంహెచ్ఓ ఆనందకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News