గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో డిశంబర్ 10వ తేదీ నాటికి వెండింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, వార్డ్ సచివాలయ కార్యదర్శులు సమిష్టిగా తమ సచివాలయ పరిధిలో రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణలు తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో లాలాపేట, పట్నంబజార్ వార్డ్ సచివాలయ కార్యదర్శులతో ఆక్రమణల తొలగింపు పై ప్రత్యేకంగా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, డ్రైన్ల మీద ఆక్రమణల వలన పూడిక తీయడటానికి వీలు లేక, మురుగుపారుదలకు ఆటంకంగా ఉండడం వలన అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఇప్పటికే దశల వారీగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు చేపట్టామన్నారు. డిశంబర్ 10 వ తేదీ నాటికి గుర్తించిన ప్రాంతాల్లో వెండింగ్ జోన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఏర్పాటు చేయకుండా సచివాలయ కార్యదర్శులు సమిష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు ఎదురైతే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News