మండపేట, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం (05-01-2026) మండపేటలోని “ది మండపేట లారీ ఓనర్స్ కల్చరల్ అసోసియేషన్” ప్రాంగణంలో గోదావరి ఐ నేత్రాలయము మరియు సుబ్బారాయుడు మెమోరియల్ హాస్పిటల్ వైద్య బృందాల సహకారంతో ఉచిత కంటి పరీక్షలు, ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా వాహనచాలకులు కంటి చూపు సరిగా లేకుండా వాహనాలు నడపడం ప్రమాదాలకు దారితీస్తుందని, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో మాత్రమే వాహనాలు నడపాలని, ప్రయాణ సమయంలో మద్యం సేవించరాదని, వేగ నియంత్రణ పాటించాలని, సీట్బెల్ట్ మరియు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు. అలసటగా ఉన్నప్పుడు వాహనం నడపకుండా విరామం తీసుకోవడం కూడా రోడ్డు భద్రతకు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లారీ అసోసియేషన్ డ్రైవర్లు మరియు ఆటో యూనియన్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు, ఉచిత రక్తపోటు పరీక్షలు నిర్వహించగా, దాదాపు 100 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్తో పాటు వైద్య అధికారులు, వైద్యులు, అసోసియేషన్ సభ్యులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిహెచ్. సంపత్ కుమార్, శ్రీ ఎం. రవికుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బి. ఉమా మహేశ్వర రావు, జి. ప్రణీత్ కుమార్, జి. రాధికా దేవి, కె. చైతన్య సుమ, పి.వి.వి.డి. సాయి కుమార్, అలాగే వైద్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News