– భవిష్యత్ లో ప్రపంచాన్ని శాసించే శక్తి దేశ యువతదే
– లక్ష్య సాధనలో యువత తమ సంకల్పబలాన్ని పెంపెందించుకోవాలి
– రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వామి వివేకానంద బోధనలను యువత రోల్ మోడల్గా తీసుకుని, తమ నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంపెందించుకోవాలని రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద పిలుపునిచ్చారు.
స్వామి వివేకానంద 163 వ జయంతిని పురస్కిరించుకొని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రంలో జాతీయ యువజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యువజనోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద మాట్లాడుతూ.. వివేకానందుని బోధనలను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. వివేకానందుడు 33 సంవత్సాలు జీవించి 150 సంవత్సరాల చరిత్రను ప్రపంచానికి అందించారన్నారు. నేటి యువత మెడిటేషన్ ను అలవాటుగా చేసుకుని సంకల్ప బలాన్ని పెంపెందించుకోవాలన్నారు. నేటి ఇంటర్నెట్ యుగంలో నైపుణ్యాలను పెంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. యువత తమ విలువైన సమయాన్ని వినోదానికి కాకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కేటాయించాలన్నారు.
జీవితంలో అతిపెద్ద సవాలు తమ మనస్సును నియంత్రించుకోవడమేనని, మనస్సు అదుపులో ఉంటేనే ఏకాగ్రత పెరుగుతుందని తద్వారా సానుకూల ఆలోచనలు వస్తాయన్నారు. స్వామి వివేకానంద జీవితం, ఆయన చికాగో ప్రసంగం, ఆయన బోధనలు యువతకు గొప్ప స్ఫూర్తినిస్తాయన్నారు. ఆయన రచించిన పుస్తకాలను విద్యార్ధులు చదవడం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుందన్నారు. కాశీలో కోతుల గుంపు వివేకానందుడిని వెంటాడినప్పుడు ఆయన పారిపోకుండా వాటిని ఎదుర్కొన్న సంఘటనను స్వామీజీ ఉదహరించారు. మన జీవితంలోని కష్టాలు కూడా కోతుల వంటివేనని, వాటిని చూసి పారిపోతే అవి మనల్ని ఇంకా భయపెడతాయని కానీ ధైర్యంగా ఎదుర్కొంటే అవి తొలగిపోతాయన్నారు. మన దేశ ఆధ్యాత్మికతను విదేశాలైన కొరియా, జపాన్ లాంటి దేశాలు నేటికీ విరివిగా ఆచరిస్తున్నాయన్నారు. ధృడమైన సంకల్ప శక్తితో ముందుకెళితే యువతకు విజయం సాధ్యపడుతుందని స్వామి స్థితి కంఠానంద తెలియజేశారు.
యువజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎస్వీడీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి 12 న స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజనోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో వ్యాస రచన, క్విజ్, డిబేట్, తదితర విభాగాల్లో పోటీలను నిర్వహించి విజేతలకు మెమొంటోలు, సర్టిఫికెట్లు అందించామన్నారు. యువతకు స్తామి వివేకానంద అందించిన బోధనలు నేటికీ ఆచరణీయమన్నారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల్లో రాష్ట్రానికి చెందిన 80 మంది పాల్గొనడం శుభ పరిణామమన్నారు.
కృష్ణా జిల్లా స్టెప్, కృషి సీఈవో యూ. శ్రీనివాసరావు మాట్లాడుతూ వివేకానందుని జీవితం యువతకు ఆదర్శనీయమని, ఆయన ఆదర్శాలను ఆచరణలో పెట్టి దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. జాతీయ యువజనోత్సవాల్లో పలు కళాశాలలకు చెందిన విద్యార్ధులు పాల్గొన్నారన్నారు.
అనంతరం వ్యాస రచన, క్విజ్, డిబేట్ తదితర పోటీల్లో గెలుపొందిన కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన విజేతలకు ప్రశంసా పత్రాలు, షీల్డ్ లు అందించారు.
కార్యక్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ అధికారి శ్రీనివాసరావు, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ హరిప్రసాద్, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కే. రమేష్, జిల్లా విద్యా శాఖ అధికారి మధుభూషణ్, సామాజికవేత్త గోళ్ల నారాయణరావు, చెస్ ఛాంపియన్ ప్రియాంక, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్ధులు, ఎఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్ధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News