కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ గా తోకల రామకృష్ణను నియమించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజలతో ఆయనకున్న సంబంధాలు, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను గుర్తించిన బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఈ బాధ్యతను అప్పగించారు. తనకు అప్పగించిన బాధ్యతను నూటికి నూరు శాతం ఎలాంటి స్వప్రయోజనాలు పొందకుండా భారత చైతన్య యువజన పార్టీ బలోపేతానికి, బిసి, ఎస్,సి ఎస్టి, మైనారిటీల అన్ని రకాల అభివృద్ధిలోనూ తన వంతు కృషి అందిస్తారని ఆకాంక్షించారు.
అనంతరం తోకల రామకృష్ణ మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ గా తనను నియమించినందుకు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా తాను ఈ బాధ్యతకు అర్హుడని నమ్మిన బీసీవై నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనతో పాటు ఎంపికైన తోటి కన్వీనర్లకు, ఇతర పదవులను అలంకరించిన బీసీవై పార్టీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నియామకం పట్ల తోకల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. కైకలూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను పక్కనపెట్టి అధికార మత్తులో మునిగిన ప్రభుత్వాన్ని కైకలూరు వేదికగా ఎండగడతానని అన్నారు. నిజాలను నిర్భయంగా ప్రజల ముందు ఉంచి బీసీవై పార్టీ అధినేత ఆశయాలకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలు ఉద్యమాలు పోరాటాల ను ప్రతి గ్రామం ప్రతి యువకుడికి చేరవేయడమే తన ప్రధాన లక్ష్యమని తోకల రామకృష్ణ పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం బహుజనుల ఆత్మగౌరవం కోసం బీసీవై పార్టీ సాగిస్తున్న రాజకీయ పోరాటంలో కైకలూరు నియోజకవర్గం కీలక పాత్ర పోషిస్తుందని అందుకోసం అవసరమైన అన్ని రకాల ప్రణాళికలు తయారుచేసి ముందుకు సాగుతామని అన్నారు.
Prajavartha Online Telugu News