– ఓట్లకు కోట్లు కుమ్మరించే వారిని నమ్మకండి
– నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులను గెలిపించండి
– సీపీఐ పశ్చిమ అభ్యర్థి జి.కోటేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తాను కార్పొరేటర్గా ఉన్న సమయంలో కార్పొరేషన్ పరిధిలోని స్థలాలను క్రమబద్ధీకరించి రిజిస్ట్రేషన్ చేయించామని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొండ ప్రాంతంలోని ప్రతి ఇంటికి పట్టా ఇప్పించి రిజిస్ట్రేషన్ చేయిస్తానని ఇండియా కూటమి బలపరిచిన సీపీఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక 51వ డివిజన్లోని కొత్తపేట వాగుసెంటర్ కొండ ప్రాంతంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొండ ప్రాంతంలోని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి కమ్యూనిస్టులు ఎంతో కృషి చేశారని తెలిపారు. గతంలో కమ్యూనిస్టు పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేసిన విషయాన్ని నేటికీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. నగర పాలకుల వైఫల్యం వల్ల తాగునీటి సమస్య తీవ్రంగా పెరిగిపోయిందని, మంచినీటి కోసం ప్రజలు అల్లాడే పరిస్థితి వచ్చిందన్నారు. పన్నుల రూపంలో ప్రజలను దోచుకుంటున్న పాలకులు సదుపాయల కల్పనలో మాత్రంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కోట్ల రూపాయలను కుమ్మరించే బడా బాబులను కాకుండా.. నిత్యం ప్రజల మధ్య ఉంటే, ఏ సమస్య వచ్చినా పిలిస్తే పలికే కమ్యూనిస్టులను గెలిపించాలని జి.కోటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు తాడి పడియ్య, కొట్టు రమణారావు, పంచదార్ల దుర్గంబ, కార్యవర్గ సభ్యులు డివి. రమణ బాబు, సంగుల పెరయ్య, సింగరాజు సాంబశివరావు, దోనేపూడి సూరి బాబు, నాయకులు ఆకుల ఏసు, ఎస్. శ్రీనివాసరావు, పితా రాజు, దుర్గశి రమణమ్మ, చింతాడ పార్వతీ, కే. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.