Breaking News

వాట్సప్ సమాచారంతో మెరుపువేగంతో స్పందించిన మంత్రి లోకేష్

-దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జిఓ విడుదల
-25మంది దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తును కాపాడిన యువనేత
-లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగ విద్యార్థి మారుతీపృధ్వీ సత్యదేవ్
-రేపు (8-7-24) సోమవారం ఉండవల్లి నివాసంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థల్లోప్రవేశం పొందిన దివ్యాంగ విద్యార్థులను కలిసి అభినందించనున్న విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబిఎ చేసి చదువు విలువ తెలిసిన రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్ దివ్యాంగ విద్యార్థులు తమ దృష్టికి తెచ్చిన ఓ సమస్యపై మెరుపువేగంతో స్పందించి 25మంది భావిభారత పౌరుల బంగారు భవిష్యత్తును కాపాడారు. మంత్రి చూపిన చొరవ ఆ విద్యార్థులు దేశవ్యాప్తంగా పేరెన్నిక గన్న ఐఐటి, ఎన్ఐటి వంటి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృధ్వీ సత్యదేవ్ ఈ ఏడాది నిర్వహించిన జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించాడు. ఈ ర్యాంకు ప్రకారం సత్యదేవ్ కు చెన్నయ్ ఐఐటిలో సీటు రావాల్సి ఉంది. అయితే దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే మార్కుల మెమో విషయంలో రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు ఎప్పటినుంచో చేస్తున్న ఓ పొరపాటు దివ్యాంగ విద్యార్థులను ఇబ్బందుల్లో నెట్టింది. జెఇఇ అడ్వాన్స్ డ్ పరీక్షలో ర్యాంకు సాధించిన దివ్యాంగుడైన ఓ అభ్యర్థి తనకు ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్ అప్ లోడ్ విషయంలో ఎదురైన సమస్యను వాట్సప్ ద్వారా మంత్రి లోకేష్ కు తెలియజేశారు. వెంటనే స్పందించిన లోకేష్ సంబంధిత విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించి సమస్యను పరిష్కరించారు.
విజయవాడకు చెందిన సత్యదేవ్ కు తాను సాధించిన ర్యాంకు ప్రకారం జోసా కౌన్సిలింగ్ రౌండ్ -1లో ఐఐటి మద్రాసులో సత్యదేవ్ కు సీటు కేటాయించారు. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటర్మీడియట్ మెమో సర్టిఫికెట్‌ని అప్‌లోడ్ చేయమని అడిగారు. ఎపి ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు లాంగ్వేజ్ సబ్జెక్ట్ లు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. దీని ప్రకారం సత్యదేవ్ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష రాయలేదు. ఇంటర్ పరీక్షలలో A గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించాడు. మినహాయింపు పొందిన లాంగ్వేజ్ సబ్జెక్ట్ తో కలిపి మార్కుల మెమోలో 5 సబ్జెక్ట్ మార్కులు ఉంటాయి. మినహాయింపు పొందిన సబ్జెక్టుకు సంబంధించి సర్టిఫికేట్‌లో ఇంటర్మీడియట్ బోర్డు వారు ఎప్పటినుంచో ‘E’ (EXEMPTION) అని మాత్రమే పేర్కొంటూ జారీచేస్తున్నారు. కానీ ఐఐటీ మద్రాస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విభాగంవారు సత్యదేవ్ మెమోలో కేవలం 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని, మ్యాథ్స్ ఎ, మ్యాథ్స్ బిలను ఒకే సబ్జెక్ట్‌గా పరిగణిస్తున్నామని, అందువల్ల మీ ఇంటర్మీడియట్ పత్రాన్ని అంగీకరించబోమని సమాచారమిచ్చారు. దీనిపై సత్యదేవ్ ఐఐటి మద్రాసు వారిని సంప్రదించగా, సెకండ్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన సర్టిఫికెట్‌లో ‘ఇ’ స్థానంలో నిర్దిష్ట సంఖ్యా విలువను కలిగి ఉంటేనే కళాశాలలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. తన కెరీర్ మొత్తం ఈ ఫలితంపై ఆధారపడి ఉంది. నా జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. ఈ పరిస్థితి నుండి బయటపడేయడానికి దయచేసి నాకు సహాయం చేయాలని 22-6-2024న మంత్రి లోకేష్ కు వాట్సప్ ద్వారా మెసేజ్ చేశారు. వెంటనే స్పందించిన లోకేష్ ఐఐటిలో ర్యాంకు సాధించిన దివ్వాంగ విద్యార్థి పృధ్వి సత్యదేవ్, అతని తండ్రి జయరామ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మినహాయింపు పొందిన సెకండ్ లాంగ్వేజ్ లో “E (Exemption)”కి బదులుగా మార్కులతో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇవ్వాలని బోర్డు అధికారులకు ఆదేశించారు. వెనువెంటనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పందించి E ని కనిష్టంగా 35మార్కులుగా పేర్కొంటూ…. తదనుగుణంగా మార్కులతో కూడిన మెమో జారీచేశారు. తీరా మార్కులతో సర్టిఫికెట్ తీసుకెళ్లిన విద్యార్థికి తాము దీనిని అంగీకరించబోమని, ఎపి ప్రభుత్వం నుంచి జిఓ కావాలని మెలికపెట్టారు. ఇదే విషయాన్ని పృధ్వీ సత్యదేవ్ మళ్లీ మంత్రి లోకేష్ పేషీకి ఫోన్ ద్వారా తెలియజేశారు. సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినకూడదని, వెంటనే జిఓ విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు. అవసరమైతే చెన్నయ్ ఐఐటి అధికారులతో మాట్లాడాలని సూచించారు. వెంటనే ఆగమేఘాలపై జిఓ విడుదల చేశారు. దీంతో పృధ్వీ సత్యదేవ్ కు ఐఐటి మద్రాసులో సీటు లభించింది. ఈ జిఓ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయస్థాయిలో పేరొందిన ఐఐటి, ఎన్ ఐటి, ట్రిపుల్ ఐటి వంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో సీట్లు లభించాయి. తన భవిష్యత్తును కాపాడిన మంత్రి లోకేష్ కు పృధ్వీ సత్యదేవ్ తోపాటు దివ్యాంగ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో లోకేష్ అందించిన ఈ సాయానికి తాను జీవితాంతం రుణపడి ఉంటామని వారు ఉద్వేగంతో మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నారు. రేపు (8-7-24) సోమవారం ఉండవల్లి నివాసంలో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి వంటి విద్యాసంస్థల్లోప్రవేశం పొందిన దివ్యాంగ విద్యార్థులను కలిసి విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించనున్నారు.

Check Also

యధావిధిగా సెప్టెంబరు 23 సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *