Breaking News

ప్రజా దర్బార్ లో ప్రజల నుండి అర్జీలు స్వీకరన… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నానికి మహర్దశ రాబోతుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని జవ్వారిపేట పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఒకవైపున జోరుగా వర్షం కురుస్తున్న మరోవైపు అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అద్భుతంగా ముందుకు సాగుతూ ఉందన్నారు. మచిలీపట్నానికి మహర్దశ రాబోతుందని ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 58 కోట్ల రూపాయల వ్యయంతో అమృత్ పథకాన్ని అమలు చేయనున్నామన్నారు. అలాగే బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ 60 నుంచి 70 వేల కోట్ల రూపాయల వ్యయంతో నెలకొల్పడం జరుగుతుందని ఇందుకోసం బిపిసిఎల్ ప్రతినిధులు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి సుముఖతను వ్యక్తం చేశారన్నారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి కేంద్రం నుండి పథకాలు, నిధులు తీసుకురావడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాబోయే 2, 3 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పనకు, పరిశ్రమలు నెలకొల్పుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, తద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా మొదటిసారి పింఛన్ ను 3000 రూపాయల నుండి 4000 రూపాయలకు పెంచి పింఛన్దారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
నూరు శాతం అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు 15,000 రూపాయలు, మిగిలిన దివ్యాంగులకు 3 వేల నుండి 6000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. అలాగే అత్యవసరంగా నిర్మాణ రంగానికి సంబంధించి పేదవారు ఇల్లు కట్టుకునేందుకు ఉపయోగపడే విధంగా ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం జరిగిందని, ఆ ప్రకారం కేవలం రవాణా, లోడింగ్ చార్జీలు కట్టుకుంటే ఉచితంగా ఇసుకను పేదలందరూ పొందే అవకాశం కల్పించామన్నారు. డీఎస్సీ విద్యార్థులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో దాదాపు 16,500 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించడం జరిగిందన్నారు. గతంలో తమ ప్రభుత్వం లో ఉన్న అన్న క్యాంటీన్లలో 5 రూపాయలకే అన్నం పెట్టి పేదల కడుపు నింపడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం మూసేసిన అన్నా క్యాంటీన్లను వచ్చే ఆగస్టు మాసంలో తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు.

గత ప్రభుత్వం సరిగా నీటి యాజమాన్యం చేయక పులిచింతలలో నీరు లేక కృష్ణ డెల్టాను ఎడారి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పులిచింతల ప్రాజెక్ట్లో 30 నుంచి 40 టీఎంసీల నీరు నిలువ చేసుకోకుండా వచ్చిన వర్షపు నీటిని సముద్రంలోకి వదిలేసారని, ప్రస్తుతం అర టీఎంసీ కూడా నీరు లేదని దీంతో సాగునీటికీ, తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఆనాడు తాము నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా నీటిని వదలాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయగా ఆయన అందుకు అంగీకరించి పట్టిసీమ నుండి ప్రకాశం బ్యారేజ్ కి నీళ్లు వదలడం జరిగిందన్నారు. అక్కడి నుండి ఇవాళ తరకటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీళ్లు నింపుకోవడం జరుగుతోందన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయకుండా వ్యవస్థను సజావుగా నడిపేందుకు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలపై అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. మచిలీపట్నంలో ప్రధానంగా డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నామన్నారు.

మురుగు కాలువలలో పూడికలను తొలగించాలని జిల్లా కలెక్టర్ కు, మున్సిపల్ అధికారులకు ఇప్పటికే సూచించామని ఆ పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజల సమస్యల పట్ల తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజా దర్బారు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించి అర్జీలు వస్తున్నాయని, ఈ విషయమే రాష్ట్రస్థాయిలో త్వరలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం తన శాఖకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులు చూస్తున్నామని, త్వరలో ప్రజల దగ్గరకు నేరుగా వెళ్తామన్నారు.

విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల కిందట ఘంటసాల మండలం శ్రీకాకుళంకు చెందిన స్వరూప రాణి ప్రసవించిన బాలుడు అదృశ్యం కావడంపై పోలీసులు విచారణ జరిపారని, సీసీ ఫుటేజ్ ద్వారా ఇంగ్లీష్ పాలెం చెందిన ఒక మహిళ వద్ద ఉన్నట్లు గుర్తించి బాలుడిని ఆ తల్లి దగ్గరకు చేర్చారని, ఆస్పత్రిలో ఎవరైనా సహకరించారా అనే కోణంలో విచారణ ఇంకా జరుగుతుందని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భద్రత వైఫల్యం వలనే ఇది జరిగిందని, ఇటువంటివి పునరావృతం కాకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో ఎమ్మారై స్కానింగ్ చేయుటకు ఫిల్ములు లేవని చెబుతున్నారని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి వెంటనే స్పందిస్తూ ఈ విషయమై తగిన చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక నాయకులు బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *