– స్వర్ణాంధ్ర @ 2047 ప్రణాళికల అమలుపై ప్రత్యేక దృష్టి
– అన్ని రంగాల్లో 15 శాతం సగటు వృద్ధి సాధనకు చర్యలు
– టూరిజం హబ్గా జిల్లాను తీర్చిదిద్దేందుకు కసరత్తు
– కొత్త టూరిజం ప్యాకేజీ రూపకల్పనకు భాగస్వామ్య పక్షాలతో చర్చలు
– పారిశ్రామిక వృద్ధికి, ఉపాధి సృష్టికి వీలుకల్పించే ఎంఎస్ఎంఈ అభివృద్ధికీ చర్యలు
– సమష్టి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ది పథంలో నడిపిద్దాం
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త సంవత్సరంలో నూతన ఒరవడితో నిర్మాణాత్మక అభివృద్ధికి చేసే కృషిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, సమష్టి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
కలెక్టర్ లక్ష్మీశ సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ వీసీ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి కొత్త సంవత్సరంలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కీలక భాగస్వామ్యంతో బుడమేరు వరదల సమయంలో చేసిన కృషి మంచి ఫలితాలు ఇచ్చిందని.. సహాయ చర్యలతో పాటు ఆర్థిక సహాయ పంపిణీ వరకు బాధితులకు అండగా నిలవడంలో విజయవంతమయ్యామని పేర్కొన్నారు. ఇదేవిధంగా కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు టీమ్ ఎన్టీఆర్ కృషిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశంతో రూపొందించిన స్వర్ణాంధ్ర @ 2047 ప్రణాళికల అమలుపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని, 15 శాతం సగటు వృద్ధికి ఇప్పటికే అధికారులను సన్నద్ధం చేసినట్లు వివరించారు. పారిశ్రామిక వృద్దితో పాటు పెద్దఎత్తున ఉపాధి సృష్టికి వీలుకల్పించే ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సేవా రంగం వృద్ధిలో భాగంగా జిల్లాను టూరిజం హబ్గా మార్చేందుకు కృషిచేస్తున్నామని.. కొత్త టూరిజం ప్యాకేజీ రూపకల్పనకు భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. పర్యాటక గైడ్లు ఏర్పాటు వంటి ప్రయోగాత్మక కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. నవ రాజధాని అమరావతికి ముఖద్వారమైన విజయవాడను పరిశుభ్ర, హరిత, సమృద్ది నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీవోలు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ల ప్రతినిధులు తదితరుల సూచనలు, ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
సంక్షేమం, అభివృద్ధికీ సమ ప్రాధాన్యం:
ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు శూన్య పేదరికం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్దికీ సమ ప్రాధాన్యమిస్తున్నామని.. కొత్త వత్సరంలోనూ ఇదే పంథా కొనసాగిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పథకాల ప్రయోజనం తప్పక అందుతుందని స్పష్టం చేశారు. డబ్బు ఆదాతోపాటు ప్రతి ఒక్కరినీ పునరుత్పాదక ఇంధన వినియోగం దిశగా నడిపించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని కొత్త సంవత్సరంలో మరింత సమర్థవంతంగా అమలుచేసేందుకు కృషిచేయనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపే దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రతి జిల్లా అధికారినీ నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి ప్రధానమ పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్దికి ఉపాధి కల్పనను అనుసంధానం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు కృషిచేస్తున్నామన్నారు. మీడియా నిర్మాణాత్మక సూచనలు చేస్తూ జిల్లా అభివృద్దిలో భాగస్వామ్యం అందించాలని కలెక్టర్ లక్ష్మీశ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News