-మల్టీ టాస్కింగ్ సిబ్బంది, సాగర మిత్రాలకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి
ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పునరుద్ధరణపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2020-21 నుండి 2024-25 వరకు ఐదు సంవత్సరాల కాలానికి ఆమోదించబడిందని తెలిపారు. ఈ ప్రణాళిక గడువు 31 మార్చి 2025న ముగిసిందని, అయితే 15వ ఆర్థిక సంఘం చివరి వరకు అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని పొడిగించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం కింద ప్రస్తుతం ఎంతమంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పని చేస్తున్నారు, అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన సిబ్బంది సేవలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రణాళికలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మత్స్య కమిషనర్ కార్యాలయంలో మత్స్య సంపద యోజన రాష్ట్ర కార్యాచరణ విభాగంలో ఒకే ఒక్క మల్టీ టాస్కింగ్ సిబ్బంది పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదించిందని తెలిపారు. ఈ పథకం నిబంధనల ప్రకారం సిబ్బంది నియామకం పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదిక అని తెలియజేసారు. పథకం వ్యవధి ముగిసిన తరువాత ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను లేదా సర్దుబాటును అందించే ప్రతిపాదన ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివేదించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, “తీరప్రాంతం విస్తారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘బ్లూ ఎకానమీ’ వృద్ధి కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వంటి పథకాలు కీలకమన్నారు. ఇది ఫలితాలివ్వడమే కాకుండా మత్స్య జీవనోపాధులకు తోడ్పడుతోంది కాబట్టి ఈ పథకాన్ని భవిష్యత్తులో కొనసాగించాలని కోరారు. అలా ఈ పథకాన్ని కొనసాగించని పక్షంలో ఇందులో పని చేస్తున్న అనుభవజ్ఞులైన మల్టీ టాస్కింగ్ సిబ్బంది తోపాటు సుమారు 317 మంది సాగర మిత్రాలకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు.
Prajavartha Online Telugu News