విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో కమ్మ విద్యార్థి సహాయ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అదివారం మొగల్రాజపురం పీబీ సిద్ధార్థ అడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ కమ్మ సంక్షేమ, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని, దాతల నుంచి సహాయం పొందిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని, వారి స్ఫూర్తితో మరి కొందరికి సాయం చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. సమాజ, రాష్ట్రాభివృద్ధి అంతా విద్యపైనే అధారపడి వుంటుందన్నారు. కేవలం తమ సామాజిక వర్గంలోని వారికే కాకుండా అన్ని కులాల వారికి ఉపకార వేతనాలను అందజేయడం అభినందనీయమని కొనియాడారు. ఇప్పుడు సహాయం పొందిన విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నప్పుడు పేదలకు సహాయం చేయాలన్నారు. త్వరలో తమ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధికి స్కిల్ ట్రైనింగ్, సెల్ఫ్ ఎంప్లాయీమెంట్లో శిక్షణా శిబిరాలతో పాటుగా జాబ్మేళాలను నిర్వహిస్తామన్నారు.
కమ్మ విద్యార్థి సహాయ సంఘం అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, కార్యదర్శి పర్వతనేని ప్రభాస్ మాట్లాడుతూ 31 సంవత్సరాల నుంచి కుల మతలాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన అన్నివర్గాల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 400 మంది విద్యార్థులకు రూ.30 లక్షల విలువైన ఉపకార వేతనాలను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి చనుమోలు కృష్ణారావు. ఉపాధ్యక్షులు పొట్లూరి భాస్కరరావు, మక్కెన ఆంజనేయులు, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News