గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మల్లవల్లి పారిశ్రామిక వాడలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. మల్లవల్లి నోటిఫైడ్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీసెస్ సొసైటీ కమిటీ(ఐలా)ని ఇటీవల నూతనంగా ఏర్పాటు చేశారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు బుధవారం రాత్రి విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యార్లగడ్డను మర్యాదపూర్వకంగా కలిసి పారిశ్రామికవాడ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పారిశ్రామిక వాడలో విద్యుత్ అంతరాయాలను నివారించాలని, కొత్తగా పరిశ్రమల నిర్మాణానికి అనువుగా భూములు మెరక చేసేందుకు మట్టి లభ్యం కావడం లేదని, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేని కోరారు. పారిశ్రామికవేత్తలు ప్రస్థావించిన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ పారిశ్రామికవాడలో విద్యుత్ సరఫరా అంతరాయాలు నివారించి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ కేంద్రం మంజూరు అయిందని సత్వరమే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఇతర సమస్యలను పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు గొట్టుముక్కల రవికుమార్, ఉపాధ్యక్షులు వంటిపల్లి వెంకట కిరణ్, కార్యదర్శి తాడపనేని మురళీధర్, కార్యదర్శి సంబంగి ఫణీంద్ర, కోశాధికారి వెచ్చ వంశీకృష్ణ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News