-సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ నాయకత్వంతోనే ఇది సాధ్యం
-సంక్షేమం, అభివృద్ధి బ్యాలెన్స్ చేస్తూ పాలన సాగిస్తున్నాం
కర్నూల్, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూల్లోని ఆయన కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా సీ.ఎం.ఐ.ఈ డేటా ఆధారంగా విడుదల చేసిన నివేదికలో దేశవ్యాప్తంగా గత తొమ్మిది నెలల్లో వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ బలమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని మంత్రి టీజీ భరత్ అన్నారు. మాటిచ్చిన విధంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు.
సీబీఎన్ బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబడిదారులు తరలివస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితిని గత పాలకులు తీసుకొస్తే.. తమ ప్రభుత్వం వచ్చాక పారిశ్రామికవేత్తల్లో పూర్తి నమ్మకాన్ని కలిగించామన్నారు. విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. విశాఖలో జరిగిన ఒప్పందాలన్నీ గ్రౌండింగ్ అయ్యేలా తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. జూమ్ కాల్లో మాట్లాడి రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ను రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మంత్రి నారా లోకేష్కు దక్కిందన్నారు. గూగుల్ రాకతో ఇప్పుడు అందరి దృష్టి ఏపీవైపు మళ్లిందన్నారు. బెస్ట్ పాలసీలు తీసుకురావడంతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి అనుమతులు కావాలన్నా పెట్టుబడిదారులకు ఇబ్బంది కలగకుండా తొందరగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ పాలన సాగిస్తున్నామని మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News