-జనవరి 8న కాకినాడలో నిర్వహణ
– జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డి.ఎం.ఎం. శేషగిరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్కీం పథకంలో భాగంగా ఈ ఏడాది గిరిజన క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి తొలిసారిగా ‘ఖేలో ఇండియా ట్రైబల్ క్రీడలు–2026’ పేరుతో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించ నున్నట్లు, ఈ పోటీలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి ఎంపికలను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జనవరి 8, 2026న కాకినాడలో నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డి.ఎం.ఎం. శేషగిరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ ఏజ్ కేటగిరిలో గిరిజన పురుషులు, మహిళలకు అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, హాకీ, ఫుట్బాల్ విభాగాల్లో ఈ ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎంపికల్లో పాల్గొన దలచిన ఆసక్తి కలిగిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గిరిజన క్రీడాకారులు తమకు సంబంధించిన క్రీడా పరికరాలతో సహా జనవరి 8న గురువారం ఉదయం 9 గంటలకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, నాగమల్లి తోట, జె ఎన్ టి యూ సమీపంలో, కాకినాడ క్రీడా ప్రాంగణం వద్ద హాజరుకావాలని సూచించారు. ఈ ఎంపికల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను మొదటి ఖేలో ఇండియా ట్రైబల్ క్రీడలు–2026 జాతీయ స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులకు టి.ఏ. & డి.ఏ.లు చెల్లించబడవని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు సంప్రదించవలసిన నంబర్: 8712622569
Prajavartha Online Telugu News